School Bag Weight Concern: ప్రైవేట్ స్కూళ్లలో పుస్తకాల ధరల విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విద్యార్థులపై ఖరీదైన ప్రైవేట్ పబ్లిషర్ల పుస్తకాలను బలవంతంగా మోపడం సరికాదని ప్రశ్నించింది. ఈ అంశంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని కేంద్ర విద్యాశాఖ, సీబీఎస్ఈతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది.
నిర్బంధ విద్య హక్కు చట్టానికి విరుద్ధం
కమిషన్ అభిప్రాయం ప్రకారం, ప్రైవేట్ స్కూళ్లు ఇష్టానుసారంగా ఖరీదైన పుస్తకాలను తప్పనిసరిగా కొనాల్సిందిగా చెప్పడం, పిల్లల ఉచిత, నిర్బంధ విద్య హక్కు చట్టానికి విరుద్ధంగా ఉంటుంది. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలపై ఇది భారీ ఆర్థిక భారం మోపుతోందని ఎన్హెచ్ఆర్సీ ఆందోళన వ్యక్తం చేసింది.
ఎన్సీఈఆర్టీ పుస్తకాల ధరలు సాధారణంగా రూ.200 నుంచి రూ.700 మధ్యలో ఉండగా, ప్రైవేట్ పబ్లిషర్ల పుస్తకాల సెట్ మాత్రం రూ.3,000 నుంచి రూ.10,000 వరకు ఉంటుందని కమిషన్ గుర్తించింది. ఈ భారీ ధరల వల్ల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది.
బ్యాగుల బరువుపైనా ఆందోళన
అదే సమయంలో, అనేక పుస్తకాలను సూచించడం వల్ల స్కూల్ బ్యాగుల బరువు కూడా పెరుగుతోందని కమిషన్ హెచ్చరించింది. చిన్నపిల్లలు ఇంత బరువైన బ్యాగులు మోసుకోవడం వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమస్యపై సంబంధిత అధికారులు తీసుకున్న చర్యల వివరాలను 30 రోజుల్లోగా సమర్పించాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. మొత్తం పరిస్థితిని పరిశీలించి, అవసరమైన మార్పులు తీసుకురావాలని సూచించింది.