విశాఖపట్నం, క్రైమ్ మిర్రర్: తరుచుగా బస్సు ప్రమాదాలుగా ప్రయాణీకులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. బస్సులో ప్రయాణం చేస్తే సురక్షితంగా గమ్యాలకు చేరుతామనే భరోసా ఉండేది కాని ఇప్పుడు గ్యారంటి లేని పరిస్థితులు తలెత్తుతున్నాయి. తాజాగా విశాఖపట్నంలో జరిగిన బస్సు ప్రమాదంలో పెను ప్రమాదమే తప్పింది.ప్రయాణీకులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
ఆటోనగర్ ప్రధాన రహదారిపై బస్సు ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఇంజిన్ భాగం నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్, అప్రమత్తమై వెంటనే వాహనాన్ని నిలిపివేశారు. మంటలు వేగంగా వ్యాపించకముందే డ్రైవర్ బస్సు నుంచి కిందకు దిగిపోయారు. చూస్తుండగానే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
డ్రైవర్ సమయస్పూర్తితో తప్పని పెను ప్రమాదం…
ఇంజిన్ నుంచి మంటలు రాగానే డ్రైవర్ సమయస్పూర్తితో బస్సును ఆపివేసి ప్రయాణీకులను వెంటనే కిందకు దించాడు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడటంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నడి రోడ్డుపై బస్సు తగలబడుతుండటంతో ఆ ప్రాంతంలో కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. బస్సు నడుస్తుండగా సాంకేతిక లోపం లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
