Wife Plots Husband’s Murder Over Relationship: మధ్య ప్రదేశ్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నల్లగా ఉన్నాడంటూ ఓ మహిళ భర్తను హత్య చేసింది. తన ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. ఈ ఘోరం ధర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే?
పోలీసుల వివరాల ప్రకారం, 28 ఏళ్ల దేవ్ కృష్ణ పురోహిత్కు అదే ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల ప్రియాంకతో కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లి తర్వాత నుంచి వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. భర్తను అవమానిస్తూ, అతడు నల్లగా ఉన్నాడంటే తరచుగా తిట్టేది. అదే సమయంలో ఆమె రాజ్ ఘఢ్ కు చెందిన కమ్ లేశ్ పురోహిత్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఈ స్నేహం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. తమ మధ్య ఉన్న బంధానికి దేవ్ కృష్ణ అడ్డుగా ఉన్నాడని భావించిన వీరిద్దరూ అతడిని తొలగించాలనే నిర్ణయం తీసుకున్నారు.
ఈ హత్యకు సంబంధించి కమ్లేశ్ తన మిత్రుడు పరిచయస్తుడైన సురేంద్ర భక్తిని సంప్రదించాడు. దేవ్ కృష్ణను హత్య చేయడానికి లక్ష రూపాయలకు ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా ముందస్తుగా 50 వేల రూపాయలు కూడా ఇచ్చారు. ప్లాన్ ప్రకారం ఏప్రిల్ 7న రాత్రి సురేంద్రతో పాటు మరికొందరు దేవ్ కృష్ణ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ సమయంలో దేవ్ కృష్ణ నిద్రలో ఉండగా, అతనిపై దాడి చేసి హతమార్చారు. ఘటన అనంతరం ప్రియాంక పోలీసులకు కట్టుకథ చెప్పింది. దొంగలు ఇంట్లోకి వచ్చి భర్తను చంపి, నగలు దోచుకెళ్లారని తెలిపింది.
భార్యపై పోలీసులకు అనుమానం రావడంతో..
అయితే, ప్రియాంక మాటల్లో తేడాలు ఉండటంతో పోలీసులు అనుమానించారు. ఇంటి తనిఖీలో ఆమె చెప్పిన నగలు అక్కడే దొరకడంతో నిజం బయటపడింది. మొబైల్ కాల్స్ చెక్ చేయడంతో కమ్లేశ్తో ఉన్న సంబంధం బయటకు వచ్చింది. దీంతో పోలీసులు ప్రియాంకను కస్టడీలోకి తీసుకుని విచారించగా, అసలు విషయం ఒప్పుకుంది. ప్రస్తుతం పోలీసులు ప్రియాంక, కమ్లేశ్ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సురేంద్ర భక్తి పరారీలో ఉండగా, అతడి కోసం గాలింపు కొనసాగుతోంది.
