తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మార్మోగుతోంది. సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ జెండాను భుజాన మోసి.. పార్టీ పెట్టిన భిక్షతో అత్యున్నత పదవులు అనుభవించిన నాయకుడు ఇలాంటి క్లిష్ట సమయంలో హస్తం పార్టీని వీడటం హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్త వెలువడినప్పటి నుండి సొంత పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనపై విమర్శల వర్షం కురుస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండాల్సింది పోయి స్వార్థ ప్రయోజనాల కోసం గోడ దూకడం ఏంటని సామాన్య కార్యకర్తలు నిలదీస్తున్నారు.
బి-ఫారాల రికార్డ్: కాంగ్రెస్ ఇచ్చిన అంతులేని ప్రోత్సాహం
జీవన్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఇచ్చిన ప్రాధాన్యత మరే ఇతర నాయకుడికి దక్కలేదని స్పష్టమవుతోంది. దేశంలోనే అత్యధిక సార్లు బి-ఫారాలు అందుకున్న అరుదైన ఘనత ఆయన ఖాతాలో ఉంది. మొత్తం 11 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అధిష్టానం ఆయనకు టికెట్ ఇచ్చింది. అందులో ఐదుసార్లు విజయం సాధించగా.. మంత్రిగా బాధ్యతలు నిర్వహించే గొప్ప అవకాశం దక్కింది. కేవలం శాసనసభకే పరిమితం కాకుండా మూడు సార్లు ఎంపీగా పోటీ చేసే వీలు కల్పించింది. ఆ మూడు లోక్సభ ఎన్నికల్లోనూ ఆయన పరాజయం పాలైనప్పటికీ పార్టీ ఏనాడూ ఆయనను విస్మరించలేదు. ఒకసారి ఎమ్మెల్సీగా కూడా బీ-ఫారం ఇచ్చి పెద్దల సభకు పంపింది. ఇలా తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మొత్తం 15 సార్లు పార్టీ టికెట్ పొందారంటే ఆయనపై అధిష్టానానికి ఉన్న అచంచలమైన నమ్మకం ఎంతో అర్థమవుతోంది.
ఓడినా వీడని అదృష్టం.. అయినా అందని సంతృప్తి
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఓటమి చవిచూశారు. అయినా సరే ఓడిపోయిన ఆరు నెలల కాలంలోనే మళ్లీ ఎంపీగా పోటీ చేసే బంపర్ ఆఫర్ కాంగ్రెస్ ఇచ్చింది. అక్కడ కూడా ప్రజలు ఆయనను తిరస్కరించినప్పటికీ పార్టీ తన గౌరవం తగ్గకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగాలని సూచించింది. ఇన్ని అవకాశాలు వరుసగా తలుపు తట్టిన తర్వాత కూడా ఇంకా ఏదో ఆశించి పార్టీ మారడం ఎంతవరకు సమంజసమని కేడర్ ఘాటుగా ప్రశ్నిస్తోంది. కేవలం పదవుల కోసమే పాకులాడే తత్వం ఉన్న నాయకుడికి అసలు రాజకీయ సిద్ధాంతాలు ఉండవా అంటూ నియోజకవర్గ వ్యాప్తంగా పోస్టులు దర్శనమిస్తున్నాయి.
బీఆర్ఎస్ చేరికపై అనుమానాలు.. కార్యకర్తల సూటి ప్రశ్నలు
రేపు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన తర్వాత అక్కడ ఆశించిన గుర్తింపు రాకపోతే జీవన్ రెడ్డి పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్. అధికారం ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లడం రాజకీయాల్లో సహజమే కావచ్చు. కానీ జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత నైతిక విలువలను వదిలేసి ఇలా చేయడం కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవేళ గులాబీ పార్టీలో ప్రాధాన్యత తగ్గితే మళ్లీ కాంగ్రెస్ తలుపు తడతారా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే దశాబ్దాల బంధాన్ని తెంచుకుంటున్నారని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వదిలి వెళ్లడం నైతిక ద్రోహం అని కార్యకర్తలు బలంగా అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: Paddy Procurement: ధాన్యంలో తాలు లేకుండా చూసుకోండి, రైతులకు వ్యవసాయ అధికారుల సూచన!
