* జగన్ మావిగన్ ప్రతిపాదన పై ఆగ్రహం
* తమ రాజకీయ భవిష్యత్తు పణంగా పెడుతున్నారని ఆవేదన
* పార్టీ కార్యకలాపాలకు దూరంగా మాజీమంత్రి
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? జగన్ వైఖరి పై ఆగ్రహంగా ఉన్నారా? రాజధానుల విషయంలో తరచూ మాట మార్చుతుండడాన్ని సహించలేకపోతున్నారా? ఇలా అయితే వైసీపీలో కొనసాగలేనని తేల్చి చెప్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొద్దిరోజులుగా ఆయన రాజకీయాల్లో కనిపించకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
ప్రతికూలతే అధికం..
ఇటీవల జగన్మోహన్ రెడ్డి మావిగన్ రాజధాని ప్రతిపాదన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం పై అనుకూలత కంటే ప్రతికూలత అధికంగా ఉంది. ప్రధానంగా కృష్ణా తో పాటు గుంటూరు జిల్లాలో ప్రజలు బాహటంగానే విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆ రెండు జిల్లాల్లో వైసీపీ నేతలు పూర్తి ఇరకాటంలో పడ్డారు. ముఖ్యంగా కొడాలి నాని జగన్ నిర్ణయం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అమరావతికి జగన్ వ్యతిరేకం అంటే వ్యతిరేకించాం.. మూడు రాజధానులు అంటే సమర్ధించాం.. ఇప్పుడు కొత్తగా ఈ మావిగన్ ప్రతిపాదన ఏంటి? అంటూ కొడాలి నాని తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ రాజకీయ భవిష్యత్తుతో ఆటలు ఆడుకుంటున్నారని ఆయన అధినేతపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నట్లు సమాచారం.
అప్పట్లో మద్దతు..
2019లో వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అమరావతి అంతర్భాగంగా ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన నేతగా కొడాలి నాని జగన్మోహన్ రెడ్డికి బలంగా మద్దతు తెలిపారు. తన ప్రాంతంలో వ్యతిరేకత వస్తుందని తెలిసినా జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి అండగా నిలబడ్డారు. పైగా అమరావతి తో పాటు తన సొంత సామాజిక వర్గంపై కూడా కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే అందుకు 2024 ఎన్నికల్లో కొడాలి నాని మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పటికీ కూడా ఆయన రాజకీయంగా యాక్టివ్ కాలేకపోయారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా మావిగన్ ప్రతిపాదన తేవడంపై కొడాలి నాని తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఇలా అయితే పార్టీలో కొనసాగలేమని కూడా తేల్చి చెప్పినట్లు ప్రచారం నడుస్తోంది. తమ రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబెడితే.. ఆయన తిరిగి తమకు పొలిటికల్ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని అనుచరుల వద్ద కొడాలి నాని బాధపడుతున్నారట. కూటమి ప్రభుత్వం ఒకవైపు టార్గెట్ చేస్తుండగా.. జగన్ రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో జరుగుతున్న వైఫల్యం గురించి నాని అంతర్మధనంలో ఉన్నట్లు సమాచారం.
సొంత సామాజిక వర్గానికి వ్యతిరేకం..
కొడాలి నాని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. అయితే ఆ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలిచారు. జగన్ కష్టకాలంలో ఉన్న ప్రతిసారి నాని అండగా నిలబడిన సందర్భాలే అధికం. అయితే జగన్ కోసం లేనిపోని ఇబ్బందులు తెచ్చుకున్నాను అన్న బాధ కొడాలి నాని లో ఉందట. ఇప్పుడు మావిగన్ ప్రతిపాదనతో కొడాలి నాని చాలా ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు ప్రచారం సాగుతోంది. జగన్ మావిగన్ ప్రతిపాదన తర్వాత కొడాలి నాని ఇంతవరకు స్పందించకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మరి కొడాలి నాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
