-
జగన్ కొత్త రాజధాని ప్రతిపాదనతో మనస్తాపం
-
నిర్ణయాలు మార్చుకోవడం పై ఆవేదన
-
విశాఖ విషయంలో యూటర్న్…
-
ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు…
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స పార్టీకి గుడ్ బై చెబుతారా? ఆయనతో పాటు మరో 20 మంది వరకు మాజీ ఎమ్మెల్యేలు ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేయనున్నారా? కాంగ్రెస్ గూటికి చేరుతారా? ఇటీవల జగన్మోహన్ రెడ్డి వైఖరితో వారు ఈ నిర్ణయానికి వచ్చారా? పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. ప్రధానంగా మావిగాన్ రాజధాని ప్రతిపాదనతో ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు పునరాలోచనలో పడినట్లు ప్రచారం నడుస్తోంది. ఇలా అయితే పార్టీలో ఉండలేమని తేల్చి చెప్పినట్లు సమాచారం.
పెద్ద ఎత్తున ప్రచారం…
వైయస్సార్ కాంగ్రెస్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటివరకు ఉన్న అమరావతిని కాదని మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రధానంగా విశాఖకు పాలనా రాజధాని కేటాయించారు. అయితే దీనిపై ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. విశాఖ పాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఆరు సంవత్సరాలుగా ఇదే తరహా ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం- విజయవాడ- గుంటూరు క్యారీడర్ ను రాజధానిగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదన పెట్టారు. ఇది ఎంత మాత్రం ఉత్తరాంధ్ర వైసీపీ నేతలకు సహించడం లేదు. తమను అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి ముంచేస్తున్నారన్న బాధ సీనియర్ నేతల్లో ఉంది.
ప్రజల్లోకి బలంగా బొత్స …
ముఖ్యంగా బొత్స సత్యనారాయణ విశాఖ పాలనా రాజధానిగా ఎక్కువగా మాట్లాడారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర కోసం జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ప్రజల్లోకి కూడా బలంగా ఈ అంశాన్ని తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆయన అమరావతిని స్మశాన వాటికతో పోల్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి బొత్స సత్యనారాయణ సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉండేవారు. ఎవరికీ నొప్పించే తత్వం ఆయనది కాదు. అటువంటి బొత్స అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడి ఆ ప్రాంత ప్రజల ఎదుట విలన్ గా మారారు.
అయినా సరే ఉత్తరాంధ్ర కు న్యాయం చేస్తారన్న భావనతోనే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల కు జై కొట్టారు బొత్స. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా మావిగన్ తెరపైకి తెచ్చారు. దీంతో బొత్స పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అనవసరంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇబ్బంది పడడం కంటే.. మాతృ పార్టీ కాంగ్రెస్లో కి వెళ్లిపోవడం మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం సాగుతోంది.
సీనియర్ మోస్ట్ లీడర్…
ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ బొత్స. రోశయ్య తరువాత బొత్స ముఖ్యమంత్రి పదవిని అలంకరిస్తారని ప్రచారం సాగింది. అప్పట్లో స్పీకర్ గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం పదవి వరించింది. దీంతో బొత్సకు మంత్రి పదవితో పాటు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చారు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ నేతలంతా బయటకు వెళ్లిపోయారు కానీ.. బొత్స ఫ్యామిలీ మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగింది. ఆ ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేసిన బొత్స వైసీపీ కంటే రెండో స్థానంలో నిలిచారు అంటే ఆయన బలం ఏ పాటిదో తెలుస్తోంది.
అయితే కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుందని వేచి చూశారు బొత్స. కానీ పరిస్థితి మారకపోవడంతో జగన్మోహన్ రెడ్డి 2017లో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో విజయనగరం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో వైసిపి గెలుపు కోసం పని చేశారు బొత్స. అప్పట్లో విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించడంతో బొత్స చాలా యాక్టివ్ గా పని చేశారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. కానీ ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాల విషయంలో యూటర్న్ తీసుకుంటున్నారు.
ఇది ఎంత మాత్రం బొత్సకు మింగుడు పడడం లేదని తెలుస్తోంది. తాజాగా రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి వైఖరి మారడంతో బొత్స అండ్ కో పునరాలోచనలో పడినట్లు సమాచారం. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. బొత్స వైసీపీకి గుడ్ బై చెబుతారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
