* కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రజాధనం వృథా నిజమే
* స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
* రాజ్యసభలో మంత్రి ప్రకటన
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో అడ్డంగా బుక్ అవుతోంది భారత రాష్ట్ర సమితి. దాదాపు ఈ ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే తరచూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాలేశ్వరం చుట్టూ ఆరోపణలు చేస్తూ గులాబీ పార్టీని డిఫెన్స్ లో పెడుతుంటారు. సరిగ్గా ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సైతం కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల ప్రజాధనం వృధా అయిందని ప్రకటించడం గులాబీ పార్టీకి షాక్ ఇచ్చే అంశం. బిజెపిపై ఎదురు దాడి చేయలేక.. రాష్ట్ర మంత్రి పొంగులేటి పై అవినీతి ఆరోపణలకే గులాబీ పార్టీ పరిమితం అవుతుండడం ఆ పార్టీ నిస్సహాయతను తెలియజేస్తోంది.
కేంద్ర జల శక్తి మంత్రి ప్రకటన…
తెలంగాణలో కాలేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయిందని కేంద్ర జల శక్తి మంత్రి సిఆర్ పాటిల్ రాజ్యసభ సాక్షిగా ప్రకటించారు. దీంతో తెలంగాణలో గులాబీ పార్టీకి షాక్ తగిలినట్లు అయింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అది కాలేశ్వరం కాదు.. కూలేశ్వరం అంటూ అభివర్ణిస్తుంటారు. ఇప్పుడు దానిని నిజం చేస్తూ కేంద్ర ప్రభుత్వం సైతం స్పష్టతనివ్వడంతో గులాబీ పార్టీ ఇరకాటంలో పడింది. బీఆర్ఎస్ నేతలు తమ గర్వకారణం గా చెప్పుకుంటారు కాలేశ్వరం ప్రాజెక్టును. అటువంటి ప్రాజెక్టుపై ఏకంగా కేంద్రమే అంతటి తీవ్రమైన ఆరోపణలు చేసింది. అయితే బిజెపిపై ఎదురు దాడికి దిగలేదు గులాబీ పార్టీ. దానిపై సైతం తెలంగాణ సమాజంలో విస్తృత చర్చ నడుస్తోంది.
బిజెపిపై నోరు మెదపని బిఆర్ఎస్
సాధారణంగా ప్రతిపక్షాల నుంచి ఏ చిన్న విమర్శ వచ్చినా.. మూకుమ్మడిగా విరుచుకుపడే తత్వం గులాబీ పార్టీది. అటువంటిది కేంద్రమంత్రి సి ఆర్ పార్టీ వ్యాఖ్యల విషయంలో మాత్రం ఆ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. కేంద్రంపై నేరుగా యుద్ధం ప్రకటించే బదులు.. రాష్ట్రంలోని కాంగ్రెస్ మంత్రులను.. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై వస్తున్న మైనింగ్ ఆరోపణలను ఎత్తిచూపడానికి ప్రాధాన్యమిస్తోంది. దీనివల్ల కాలేశ్వరం చర్చ పక్కకు వెళ్లి రాష్ట్రస్థాయి అవినీతి ఆరోపణలతో కాంగ్రెస్ను డిఫెన్స్ లో పెట్టాలనేది గులాబీ పార్టీ వ్యూహంగా తెలుస్తోంది.
రేవంత్ వీర విహారం..
కేంద్ర ప్రభుత్వ ప్రకటన కచ్చితంగా రేవంత్ రెడ్డికి కలిసి వచ్చే అంశం. కాలేశ్వరం ప్రాజెక్టు పై మరింత పదునైన విమర్శలు చేసేందుకు ఆయనకు అవకాశం కలిగింది. కానీ గులాబీ పార్టీ మాత్రం ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ హడావిడి చేస్తోంది. కాలేశ్వరం పై కేంద్రం చేసిన వృధా వ్యాఖ్యలకు సాంకేతిక ఆధారాలతో సమాధానం చెప్పేందుకు ఆసక్తి చూపించడం లేదు. అసలు చర్చ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మాత్రమే ఆ పార్టీ ఉంది. మరోవైపు రేవంత్ రాష్ట్రంలో గులాబీ పార్టీని.. కేంద్రంలో బిజెపిని ఇరకాటంలో పెట్టేందుకు ఈ అంశాన్ని వాడుకోనున్నారు. లక్ష కోట్ల నష్టపరిచిన ప్రాజెక్టుపై అవకతవకల కోసం సిబిఐ విచారణ జరిపించాలని సిఫారసు చేసినా.. ఎందుకు పట్టించుకోవడంలేదని బిజెపిని ప్రశ్నిస్తారు. మొత్తానికి ఇప్పుడు రేవంత్ కు బిర్ఎస్ పై సరికొత్త అస్త్రం దొరికింది.
