* సజ్జల ప్లేస్ లోకి వస్తారని ప్రచారం
* కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలిసారిగా గళం వినిపించిన సాయిరెడ్డి
* జగన్ దృష్టిలో పడేందుకేనని ప్రచారం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? ఆయన యూటర్న్ తీసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి సైతం మెత్తబడ్డారా? గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. త్వరలో విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని తెగ ప్రచారం నడుస్తోంది.
వైసీపీలో కీలక నేతగా..
రాజకీయాల్లో ఎవరి అవసరం ఎప్పుడు వస్తుందో చెప్పలేం. ఎవరు శత్రువులో.. ఎవరు మిత్రులో చెప్పలేం కూడా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయిరెడ్డి విడదీయరాని బంధం. ఆ పార్టీ కర్త,కర్మ,క్రియ అన్నట్టు ఉండేవారు విజయసాయిరెడ్డి. అటువంటి వ్యక్తి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతారని ఎవరు ఊహించలేదు. ఆ పార్టీని వదులుకుంటారని అస్సలు అంచనా వేయలేరు. అటువంటి విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్ చుట్టూ ఉన్న కోటరి పేరు చెప్పి బయటకు వెళ్లిపోయారు. వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు కానీ.. రాజకీయ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఏడాది తిరగక ముందే రాజకీయం చేయాలని ఉంది అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆయనను చేర్చుకునేందుకు ఏ పార్టీ ముందుకు రాలేదు. ప్రస్తుతం పొలిటికల్ జంక్షన్ లో నిలబడ్డారు విజయసాయిరెడ్డి. త్వరలో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని ప్రచారం మొదలైంది.
పార్టీకి దూరంగా సజ్జల..
గత కొద్ది రోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిణామాలను చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దగా కనిపించలేదు. పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టారా? లేకుంటే ఆయనే దూరం జరిగారా? అన్నది తెలియడం లేదు. అయితే ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన సూచనలు పెద్దగా వర్కౌట్ కావడం లేదు. ఆయన ఇస్తున్న కంటెంట్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్ మోహన్ రెడ్డిని ఇరకాటంలో పెడుతోంది. ఆపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు సైతం సజ్జల రామకృష్ణారెడ్డి పై వరుస ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడిన విజయసాయిరెడ్డిని తెచ్చుకోవడమే మేలని జగన్ సన్నిహితులు సలహా ఇచ్చారట. అందుకే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదట.
ఏకైక ఆప్షన్ గా..
విజయసాయి రెడ్డికి ఇప్పుడు ఏకైక ఆప్షన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఆయన బిజెపిలో చేరాలనుకున్నారు. కానీ కూటమి నుంచి బలమైన అభ్యంతరాలు రావడంతో బిజెపి హై కమాండ్ వెనక్కి తగ్గింది. దాదాపు బిజెపిలో దారులన్నీ మూసుకుపోయాయి విజయసాయిరెడ్డికి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడేందుకు విజయసాయిరెడ్డి సరికొత్త ఆలోచన చేశారు. అమరావతికి చట్టబద్ధత వేళ వైసీపీ ఇరకాటంలో పడింది. ఈ తరుణంలో విజయసాయిరెడ్డి అమరావతి రైతులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. తొలిసారిగా నేరుగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేశారు. దీంతో విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని స్పష్టమవుతోంది. సజ్జల రామకృష్ణారెడ్డి ప్లేస్ ను భర్తీ చేస్తారని కూడా పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో???
