ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల అక్రమ రవాణా గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే ఇటీవల వెలుగులోకి వస్తున్న సంఘటనలు మరింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇప్పటివరకు అరుదైన జంతువులు, పక్షులు, పాములు వంటి వాటిని స్మగ్లింగ్ చేస్తుండగా, ఇప్పుడు స్మగ్లర్ల దృష్టి చీమలపై పడటం ఆందోళన కలిగిస్తోంది. విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ప్యాకెట్లు, టెస్ట్ ట్యూబ్లు, గాజు సీసాల్లో వందల సంఖ్యలో చీమలను దాచిపెట్టి తరలిస్తున్న ఘటనలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా రాణి చీమల అక్రమ రవాణా విపరీతంగా పెరుగుతుండటం గమనార్హం. మార్కెట్లో ఒక్కో రాణి చీమ ధర రూ.21000 వరకు ఉండటం ఈ అక్రమ వ్యాపారానికి ప్రధాన కారణంగా మారింది.
రాణి చీమలు సాధారణ చీమల కంటే పెద్దవిగా ఉండటంతో పాటు కొత్త కాలనీలను సృష్టించే సామర్థ్యం కలిగి ఉంటాయి. అందువల్లే వీటికి అంతటి డిమాండ్ ఏర్పడింది. స్మగ్లర్లు ఈ చీమలను చిన్న చిన్న ట్యూబ్లలో పెట్టి ఒక దేశం నుంచి మరొక దేశానికి రహస్యంగా తరలిస్తున్నారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ఒకటి “యాంట్ కీపింగ్” అనే హాబీ. ముఖ్యంగా చైనా, యూరప్, అమెరికా ప్రాంతాల్లో ఈ హాబీకి మంచి ప్రాచుర్యం ఉంది. గాజు పెట్టెల్లో చీమల కాలనీలను పెంచుకోవడం ఒక విలాసవంతమైన వినోదంగా భావిస్తున్నారు. అందుకు అరుదైన రాణి చీమలను అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు.
ఇంకో ముఖ్య కారణం పరిశోధనల అవసరం. కొన్ని రకాల చీమల నుండి లభించే రసాయన పదార్థాలు ఔషధ తయారీలో ఉపయోగపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ కారణంతో కూడా అక్రమ రవాణా పెరుగుతోంది. అయితే ఈ చర్యలు పర్యావరణానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయి. ఒక ప్రాంతానికి చెందిన చీమలను మరో ప్రాంతానికి తీసుకెళ్లడం వల్ల అక్కడి జీవ వైవిధ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. విదేశీ చీమలు స్థానిక జాతులను నాశనం చేయడమే కాకుండా పంటలను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉంది.
అంతేకాకుండా కొత్త రకాల వ్యాధులను కూడా ఇవి వ్యాప్తి చేసే అవకాశం ఉందని జీవశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకృతి సమతుల్యతను కాపాడాల్సిన అవసరం ఉన్న ఈ కాలంలో ఇలాంటి అక్రమ చర్యలు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణ చట్టాల ప్రకారం ఈ రకమైన అక్రమ రవాణా తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. సరదా కోసం లేదా లాభాల కోసం ప్రకృతిని దెబ్బతీయడం చివరికి మానవ సమాజానికే ముప్పుగా మారుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ALSO READ: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కేంద్రం సంచలన ప్రకటన
