దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను ఒకే యాత్రలో దర్శించాలనుకునే భక్తుల కోసం IRCTCత ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. “దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం- చిదంబరం” పేరుతో రూపొందించిన ఈ ఆధ్యాత్మిక పర్యటన భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా నిర్వహించబడుతుంది. మొత్తం 8 రోజుల, 7 రాత్రుల ఈ యాత్ర మే 24న హైదరాబాద్లోని సికింద్రాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శైవ, వైష్ణవ క్షేత్రాలను ఒకే ప్రయాణంలో దర్శించుకునే అవకాశం ఈ ప్యాకేజీ ద్వారా భక్తులకు లభించనుంది.
ఈ యాత్రలో తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర స్వామి ఆలయం దర్శనం, రామేశ్వరంలోని శ్రీ రామనాథస్వామి ఆలయం, మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయం, అలాగే కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్, గాంధీ మండపం సందర్శన ఉంటుంది. అదనంగా తిరుచ్చిలోని శ్రీరంగనాథస్వామి ఆలయం, తంజావూరులోని బృహదీశ్వర ఆలయం, చిదంబరంలోని నటరాజ స్వామి ఆలయం వంటి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. షాపింగ్, స్థానిక సంస్కృతిని అనుభవించే అవకాశం కూడా మధురైలో కల్పించబడింది.
ప్యాకేజీ వ్యవధి 8 రోజులు 7 రాత్రులు కాగా, ప్రారంభ ధర రూ.14,500 నుంచి ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యార్థం స్లీపర్ క్లాస్, 3ఏసీ, 2ఏసీ తరగతుల ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఈ టూర్లో ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి శాకాహార భోజనం అందించబడుతుంది. అలాగే హోటల్ బస, రవాణా సౌకర్యం, ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ప్యాకేజీలో భాగంగా ఉంటాయి.
యాత్ర షెడ్యూల్ ప్రకారం మొదటి రోజు సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ప్రయాణం ప్రారంభమవుతుంది. రెండో రోజు అరుణాచలంలో దర్శనం అనంతరం రామేశ్వరం వైపు ప్రయాణం కొనసాగుతుంది. మూడో రోజు రామేశ్వరం ఆలయ దర్శనం, నాలుగో రోజు మధురైలో మీనాక్షి అమ్మవారి దర్శనం, షాపింగ్ కార్యక్రమాలు ఉంటాయి. ఐదో రోజు కన్యాకుమారి సందర్శన, ఆరవ రోజు తిరుచ్చి, తంజావూరు ఆలయాల దర్శనం జరుగుతుంది. ఏడో రోజు చిదంబరంలో నటరాజ స్వామి దర్శనం అనంతరం రాత్రి సికింద్రాబాద్ వైపు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఎనిమిదో రోజు రాత్రికి యాత్ర సికింద్రాబాద్ చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.
ఈ ప్యాకేజీ ధరలు ప్రయాణ తరగతిని బట్టి మారుతాయి. స్లీపర్ క్లాస్లో పెద్దలకు రూ.14,500, పిల్లలకు రూ.13,500గా నిర్ణయించగా, 3ఏసీలో పెద్దలకు రూ.21,700, పిల్లలకు రూ.20,600గా ఉంది. 2ఏసీలో పెద్దలకు రూ.27,900, పిల్లలకు రూ.26,600గా ధరలు నిర్ణయించబడ్డాయి. కొన్ని ఆలయాల్లో ప్రవేశ రుసుములు, అదనపు సదుపాయాల ఖర్చులు వ్యక్తిగతంగా భక్తులే భరించాల్సి ఉంటుంది.
ఈ ప్రత్యేక యాత్ర ద్వారా భక్తులు ఒకే ప్రయాణంలో తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సౌకర్యవంతంగా దర్శించుకునే అవకాశం పొందుతారు. ఆధ్యాత్మిక అనుభూతితో పాటు సురక్షితమైన, సమగ్ర ప్రయాణ అనుభవాన్ని ఈ టూర్ ప్యాకేజీ అందించనుంది.
ALSO READ: కలలో బంగారం, వెండి కనిపిస్తే ఏమవుతుందంటే?
