క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ సాధన ఉద్యమంలో మిలియన్ మార్చ్ కీలకమైన పాత్ర పోషించిందని తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర నాయకులు జెనిగె విష్ణు వర్ధన్ తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ వెంకన్న లు స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమ కారులు మంగళవారం నిర్వహించిన అమరులకు నివాళులు కార్యక్రమానికి ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి ఉద్యమ కారులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ నాయకులు విష్ణు వర్ధన్, తెలంగాణ వెంకన్న మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర సాధన కోసం మిలియన్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొన్న విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సుమారు 14 సంవత్సరాల క్రితం ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఉద్యమ కారులు నిర్వహించిన మిలియన్ మార్చ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుంది అన్నారు. నాటి తెలంగాణ పోరాటం ఆంధ్ర పాలకులు పెట్టుబడి దారులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం అని విష్ణు వర్ధన్, తెలంగాణ వెంకన్న లు పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమం సాధారణ ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం కాదని వారు వివరించారు. తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలకు, త్యాగం చేసిన ఉద్యమ కారులను ఆదుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ముందు ఎన్నికల మ్యానిఫెస్టోలో అమరవీరులకు, ఉద్యమ కారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ప్రధానంగా తెలంగాణ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని విష్ణు వర్ధన్, తెలంగాణ వెంకన్న కోరారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా పలుమార్లు ఉద్యమ కారుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని పలుమార్లు ప్రకటించిన నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డి అధికారిక ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమ రధసారధి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం సార్ అధ్వర్యంలో ఒక అధికారిక కమిటీని ఏర్పాటు చేయాలని వారు కోరారు.
ఈ సందర్భంగా ఎల్బీనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి, శ్రీకాంత్ చారి విగ్రహానికి తెలంగాణ ఉద్యమ కారులు జెనిగె విష్ణు వర్ధన్, తెలంగాణ వెంకన్న, అడాల యాదయ్య, జోర్క రాములు ముదిరాజ్, ఉపేంద్ర యాదవ్, కృష్ణ కుమార్ యాదవ్, గోర శ్యాంసుందర్ గౌడ్ లు ఘణంగా నివాళులు అర్పించారు.
