Monday, March 9, 2026
Homeఆంధ్ర ప్రదేశ్చిత్ర పరిశ్రమను వదిలేసిన ఏపీ ప్రభుత్వం!

చిత్ర పరిశ్రమను వదిలేసిన ఏపీ ప్రభుత్వం!

  • చిత్ర పరిశ్రమను వదిలేసిన ఏపీ ప్రభుత్వం!

  • ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి భర్తీ ఎప్పుడు?

క్రైమ్ మిర్రర్, ఏపీ: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు సమీపిస్తోంది. మూడు పార్టీల మధ్య ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోంది. అయితే కీలకమైన నామినేటెడ్ పదవుల విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. ముఖ్యంగా ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇంతవరకు భర్తీ కాలేదు.

అదిగో ఇదిగో అంటూ కాలయాపన తప్ప ఈ పదవి భర్తీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణలో 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వెంటనే ఆ పదవి భర్తీ చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. కానీ ఏపీలో మాత్రం చాలామంది ఆశావహులు సినీ పరిశ్రమ నుంచి ఉన్నారు. కానీ ఇంతవరకు ఏ ఒక్కరికి ఛాన్స్ ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం. దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నా..
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాదులోనే ఉంది. ఏపీలో విస్తరించే ప్రయత్నాలు జరగడం లేదు. స్వయంగా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అయినా సరే సినీ పరిశ్రమ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడం లేదన్న విమర్శ ఉంది. అదే సమయంలో సినీ పరిశ్రమ సైతం ఏపీని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

2024లో కూటమి ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. ఎంతవరకు ఆయనను తెలుగు సినీ ప్రముఖులు కలవలేదు. దీనినే తప్పు పట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించి దాదాపు 6 నెలలు అవుతోంది. అయినా సరే సినీ పరిశ్రమలో ఎటువంటి మార్పు రాలేదు.

రెండేళ్లు అవుతున్నా..
కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి భర్తీ చేయలేదు. ఇది నామినేటెడ్ పదవి. వైసీపీ ప్రభుత్వ హయాంలో పోసాని కృష్ణ మురళి ఈ పదవి చేపట్టారు. అయితే ఎందుకో కూటమి పెద్దగా ఆసక్తి చూపలేదు. మొన్న ఆ మధ్యన పవన్ కళ్యాణ్ తనతో సినిమా నిర్మించిన ఏఎం రత్నం లాంటి వారికి ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.

అవకాశముంటే సీఎం చంద్రబాబుకు చెబుతానని కూడా సభాముఖంగా ప్రకటించారు. దీంతో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఏఎం రత్నం నియమితులవుతారని తెగ ప్రచారం నడిచింది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది ప్రముఖులు ఉండగా ఏఎం రత్నంకు ఇవ్వడం ఏమిటనే ప్రశ్న వినిపించింది.

ఆశావాహులు..
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన చాలామంది వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అందులో యాక్టివ్ గా ఉన్న నాయకులు సైతం ఉన్నారు. పదవి ఇవ్వాలనుకుంటే వారికి ఇవ్వొచ్చు. దర్శకుడు రాఘవేంద్రరావు, నటుడు నిర్మాత మురళీమోహన్, సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు.

కానీ ఎందుకో కూటమి ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టలేదు. అయితే ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వేర్వేరు పేర్లను సిఫారసు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే అది కూర్చుని మాట్లాడుకోవాల్సిన విషయం. అయితే ఈ పదవి విషయంలో ఒకరి సిఫార్సులను మరొక్కరు అడ్డుకునే పరిస్థితి ఉండదు. అయినా సరే ఎందుకో ఈ పదవి భర్తీ విషయంలో జాప్యం జరుగుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments