వారి కోసం ఎన్నో చట్టాలు తెచ్చాం
ఆర్థిక స్వావలంబన కోసం అనేక పథకాలు అమలు
మహిళా వేధింపులను నిలదీసే సమాజం రావాలి
స్టాండ్ విత్ హర్ కార్యక్రమంలో సిఎం రేవంత్
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. జేఎన్టీయూ ఆడిటోరియంలో ’స్టాండ్ విత్ హర’ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకొస్తున్నాం. వారు ఆర్థికంగా బలపడాలనే ఆలోచనతోనే మహిళాశక్తి పథకం తీసుకొచ్చాం. మహిళలపై ప్రభుత్వానికి సంపూర్ణ విశ్వాసం ఉంది. వారి ప్రాధాన్యం గుర్తించి పార్టీలో పదవులు ఇస్తున్నాం.
ఆర్టీసీలో వెయ్యి బస్సులకు మహిళలే యజమానులు.గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. సోషల్ మీడియా మహిళలను వేధించే ఘటనలు తాజాగా పెరుగుతున్నాయి. వాటిని కట్టడి చేయాల్సి ఉందని అన్నారు. ఈ సందర్భహంగా మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ’స్టాండ్ విత్ హర’ బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మహిళా దినోత్సవం జరుపుకుంటేనే బాధ్యత తీరిపోయినట్టు కాదన్నారు.
మహిళా నాయకత్వం నుంచి వచ్చిన పార్టీ ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలను శక్తితో పోలుస్తామని.. కుటుంబ గౌరవాన్ని కూడా మహిళలతో పోలుస్తామని సీఎం తెలిపారు. మహిళలకు వేధింపులు.. పట్టణాలు, కాలేజీలు, పబ్లిక్ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాలేదని.. సోషల్ మీడియాలో మహిళలు ఎక్కువగా వేధింపులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ’మనల్ని మనం సవరించుకొని మహిళల పట్ల మన బాధ్యతల్ని నెరవేర్చాలని సీఎం సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల కేటాయింపులు, రేషన్ కార్డులు అన్నీ మహిళల పేర్ల మీదనే ఇస్తోందన్నారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాల మహిళలకు సోలార్ పవర్ ఉత్పత్తి చేసి విద్యుత్ శాఖకు అమ్మే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. ఈ నిర్ణయంతో మహిళలు అదానీ, అంబానీల స్థాయిలో విద్యుత్ రంగంలో పోటీ పడే అవకాశం ఇచ్చామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా వారి స్వేచ్ఛ పెరిగిందని సీఎం తెలిపారు.
జిల్లాల్లో ప్రభుత్వ స్థలాలు కేటాయించి మహిళల చేతుల్లో పెట్రోల్ బంకులు నిర్వహించే అవకాశాలు ఇచ్చామన్నారు. దేశంలోనే తొలిసారి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టింది తెలంగాణ ప్రభుత్వమని చెప్పారు. తెలంగాణను దేశంలోనే మహిళలకు అత్యంత భద్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.మహిళల రక్షణను సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్రెడ్డి, నగర పోలీసు కమిషనర్ సజ్జనార్, సినీ నటుడు సాయి దుర్గతేజ్ తదితరులు పాల్గొన్నారు.
