-
పలువురి భక్తులకు తీవ్రగాయాలు
-
అగ్నిగుండం దాటుతున్న క్రమంలో ఘటన
-
చాకచక్కంగా స్పందించిన వేములపల్లి, మాడుగులపల్లి ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది
క్రైమ్ మిర్రర్,వేములపల్లి ప్రతినిధి: ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన నల్గొండ జిల్లా, వేములపల్లి మండలం పరిధిలోని ఆమనగల్లు గ్రామంలో కొలువుదీరిన శ్రీపార్వతి రామలింగేశ్వర స్వామి జాతరలో బుధవారం తెల్లవారు జామున 4గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు అపశృతి చోటుచేసుకుంది. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన శ్రీపార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏడు హోలీ పండుగ పర్వదినాన పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు.

మంగళవారం మొదలైన జాతరకు జిల్లాతో పాటు వివిధ మండలాల, గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో జాతర కన్నుల పండువగా కొనసాగింది. ప్రసిద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతున్న శ్రీపార్వతి రామలింగేశ్వర స్వామి జాతరలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని గ్రామస్తలు, భక్తులు ఆవేదన చెందుతున్నారు.
జాతరలో ప్రతి సంవత్సరంలాగానే అగ్నిగుండం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వామివారి పల్లకి అగ్నిగుండం దాటుతుండగా పల్లకి వెనకాలే దాటడానికి ప్రయత్నించిన భక్తులు తన మొక్కుల్లో భాగంగా అగ్ని గుండం దాటుతున్న క్రమంలో పలువురు అగ్నిగుండంలో పడి పోయారు. దీంతో పలువురికి తీవ్రగాయాలయ్యయి. వీరిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
-
స్పందించిన ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది… తప్పిన పెను ప్రమాదం…
జాతర భక్తులతో కిటకిటలాడుతుంది. ఉన్నట్టుండి ఒక్క సారిగా జాతరలో భయంకరమైన అరుపులతో ఆ ప్రాంతం వాతావరణం దద్దరిల్లింది. ఏం జరుగుతుందో తేరుకునేలోపే ప్రమాదం చోటు చేసుకుంది. జాతరలో బుధవారం తెల్లవారు జామున అగ్నిగుండం దాటుతున్న క్రమంలో పలువురు భక్తులు ప్రమాదవశాత్తు అదుపు తప్పి పడిపోయారు. దీంతో వారి పై నుంచే మిగితా భక్తులు దాటివేళ్లారు.

దీంతో బందో బస్తు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది, వేములపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు, మాడుగులపల్లి ఎస్ఐ కృష్ణయ్య లు……ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మెరుపు వేగంతో స్పందించారు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారిని అగ్నిగుండం నుంచి బయటికి తీశారు. పోలీసులు స్పందించిన తీరును అక్కడున్న భక్తులతో పాటు పలువురు అభినందనలు తెలిపారు.
