- భద్రతా ఏర్పాట్ల పరిశీలన
- రామగుండం సీపీ అంబర్ కిషోర్ఝా
రామగుండం, క్రైమ్ మిర్రర్: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. కాగా గురువారం మంచిర్యాల పట్టణం లోని పలు పరీక్షా కేంద్రాలను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్ తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు.
పరీక్షా కేంద్రాల వద్ద జరుగుతున్న భద్రతా ఏర్పాట్లను, సీసీ కెమెరాల నిఘాను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద సిబ్బంది బందోబస్త్, పెట్రోలింగ్ చేస్తూ పరీక్ష ముగిసే వరకు సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు.
విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించడంలో పోలీసు శాఖ సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. పరీక్షా విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీపీ వెంట ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ సిబ్బంది ఉన్నారు.

