క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల పట్ల, ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అత్యంత అభ్యంతరంకరంగా ఉందని ఆయన ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉందని, ఆయన ప్రోద్బలంతోనే పోలీసులు ప్రజాస్వామ్యబద్ధమైన నిరసనలను అణచివేస్తున్నారని KTR ఘాటుగా విమర్శించారు.అసెంబ్లీ ఎదుట తమ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలను పోలీసులు తీవ్రంగా అవమానించారని, నెట్టివేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఏ విధంగానైతే నిరసనలు తెలిపారో, తాము కూడా అదే రీతిలో నిరసన వ్యక్తం చేశామని స్పష్టం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఇది శాసనసభలా కాకుండా ‘దుశ్శాసన సభ’లా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.
మహిళా ప్రజాప్రతినిధులకు జరిగిన ఈ అవమానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే పూర్తి బాధ్యత వహించాలని, వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని KTR డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కాగా, ఈ నిరసనల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
మంచి నిద్రకు మాటే మంత్రం.. ప్రశాంత నిద్ర కోసం ఆరోగ్య చిట్కాలు!
