తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమం రాజకీయంగా మాత్రమే కాకుండా వ్యక్తిగత కారణాలతో కూడా చర్చనీయాంశంగా మారింది. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా హాజరయ్యారు. అయితే విజయ్ కుటుంబ సభ్యులు కార్యక్రమంలో కనిపించకపోవడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
కనిపించని విజయ్ భార్య, పిల్లలు
ముఖ్యంగా విజయ్ భార్య సంగీత, వారి పిల్లలు ఈ కార్యక్రమానికి రాకపోవడంపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కార్యక్రమంలో విజయ్ తల్లిదండ్రులు పాల్గొన్నప్పటికీ, ఆయన భార్య, పిల్లలు లేకపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదే సమయంలో ప్రముఖ నటి త్రిష కార్యక్రమానికి హాజరుకావడం కూడా సోషల్ మీడియాలో మరింత చర్చకు కారణమైంది.
విజయ్ సంగీత మధ్య విభేదాలు
ఇప్పటికే విజయ్, సంగీత మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇద్దరి విడాకుల వ్యవహారం కోర్టులో కొనసాగుతోంది. దాదాపు 27 ఏళ్ల వివాహ జీవితం తర్వాత సంగీత ఈ ఏడాది ఫిబ్రవరిలో చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానంలో విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఆమె తన పిటిషన్లో భర్త నుంచి మానసిక ఒత్తిడి ఎదురైందని, వివాహేతర సంబంధాలపై అనుమానాలు కూడా ఉన్నాయని పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది.
తల్లితోనే పిల్లలు
విజయ్ పిల్లలు ప్రస్తుతం తల్లితోనే ఉంటున్నారని తెలుస్తోంది. అందుకే వారు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయంపై విజయ్ కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక విజయ్ రాజకీయ ప్రస్థానం కొత్త దశలోకి అడుగుపెట్టిన సమయంలో కుటుంబ వ్యవహారాలు కూడా వార్తల్లో నిలవడం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు సీఎం బాధ్యతలు చేపట్టిన ఆనందం ఉండగా, మరోవైపు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. విడాకుల కేసుకు సంబంధించిన తదుపరి విచారణ జూన్ 15న జరగనుంది.