తమిళనాడు సీఎం, టీవీకే అధ్యక్షుడు విజయ్, ఆయన భార్య సంగీతకు సంబంధించిన విడాకుల కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ కేసు విచారణను చెంగల్పట్టు జిల్లా ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది. విజయ్తో వైవాహిక బంధాన్ని ముగించాలని కోరుతూ సంగీత 2025 డిసెంబరు 24న కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ కేసుపై పలుమార్లు విచారణలు జరుగుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారం మరోసారి కోర్టు ముందుకు వచ్చింది.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ
విచారణ సందర్భంగా విజయ్, సంగీత ఇద్దరూ వ్యక్తిగతంగా హాజరుకావడం కంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని ఇరువైపుల న్యాయవాదులు కోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం, వీడియో కాన్ఫరెన్స్కు సంబంధించిన అవసరమైన వివరాలు సమర్పించాలని సూచించింది. అలాగే ఇరువురు పక్షాల తరఫున ఈమెయిల్ ఐడీలు, ఇతర అవసరమైన దరఖాస్తులు, సాంకేతిక వివరాలను కోర్టుకు అందజేయాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత తదుపరి విచారణ నిర్వహిస్తామని తెలిపింది.దీంతో కేసు విచారణను ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఆగస్టు 7న తదుపరి విచారణ
ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళనాడులోనే కాకుండా సినీ, రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. విజయ్ రాజకీయాల్లో బిజీగా ఉండగా, ఈ కేసుకు సంబంధించిన ప్రతి పరిణామం మీడియాలో ప్రాధాన్యం సంతరించుకుంటోంది. అయితే ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి విజయ్ లేదా సంగీత అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కోర్టు పరిధిలోనే వ్యవహారం కొనసాగుతుండటంతో ఇరువర్గాలు కూడా మౌనం పాటిస్తున్నాయి. తదుపరి విచారణలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకావడంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టి ఆగస్టు 7న జరిగే తదుపరి విచారణపైనే ఉంది.