పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విశాఖపట్నానికి చెందిన మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేష్ విదేశీ జలాల్లో జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది.
ఒమన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న భారతీయ నౌకపై అమెరికా దళాలు నిర్వహించిన దాడిలో ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో సురేష్ మృతి చెందినట్టు తెలిసి కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “భారతీయ నౌకపై జరిగిన దాడిలో విశాఖపట్నానికి చెందిన యువ మెరైన్ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరం. విదేశీ జలాల్లో పనిచేస్తున్న భారతీయుల భద్రతపై ఇది ఆందోళన కలిగించే విషయం” అని ఆయన పేర్కొన్నారు.
ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ సంఘటన జరగడం మరింత కలచివేస్తోందని ఆయన అన్నారు. సురేష్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అలాగే, ఈ కష్టకాలంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అవసరమైన సహాయం అందించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ ఘటనతో పశ్చిమాసియా ప్రాంతంలో భద్రతా పరిస్థితులపై మరోసారి చర్చ మొదలైంది. విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల రక్షణపై కేంద్రం, సంబంధిత సంస్థలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ALSO READ: తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జోరు: ఈ వీకెండ్ భారీ వర్షాల హెచ్చరిక… ఏ జిల్లాల్లో ఎక్కువ? పూర్తి వివరాలు