-
బాల్య వివాహాలు చేస్తే చర్యలు తప్పవు…
-
బాలికలకు 18, బాలురకు 21ఏళ్లు తప్పనిసరి
వెల్దుర్తి, క్రైమ్మిర్రర్: పల్నాడు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం వెల్దుర్తి మండల పరిధిలోని రామచంద్రాపురం తండాలో ఒక బాల్య వివాహాన్ని ఇంచార్జ్ కలెక్టర్ సంజన సింహా సకాలంలో స్పందించి, అధికారులను అప్రమత్తం చేయడం ద్వారా విజయవంతంగా అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే రామచంద్రాపురం తండాలో ఒక మైనర్ బాలికకు వివాహం జరుగుతున్నట్లు అర్ధరాతి 2 గంటలకు సమాచారం అందుకున్న ఇంచార్జ్ కలెక్టర్, వెంటనే సంబంధిత అధికారులను క్షేత్రస్థాయికి వెళ్లాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వెల్దుర్తి తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, ఎస్.ఐ, ఐ.సి.డి.ఎస్ మరియు చైల్డ్లైన్ ప్రతినిధులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అధికారులు బాలిక వయస్సు ధృవీకరణ పత్రాలను పరిశీలించగా, వివాహానికి చట్టబద్ధమైన వయస్సు నిండలేదని నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు వెంటనే వివాహాన్ని నిలిపివేసి, బాలికను సంరక్షణలోకి తీసుకున్నారు. పిల్లల బంగారు భవిష్యత్తును నాశనం చేసే బాల్య వివాహాలను జరపవద్దని ఇంచార్జ్ కలెక్టర్ సంజనా సింహా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం వివాహానికి బాలికలకు 18 ఏళ్లు, బాలురకు 21 ఏళ్లు నిండడం తప్పనిసరి అన్నారు. నిబంధనలు అతిక్రమించి బాల్య వివాహాలు చేసే తల్లిదండ్రులు, ఇందుకు సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.