రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్కు రానున్నారు. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఆయన భారతదేశంలో పర్యటించనున్నట్లు రష్యా ప్రభుత్వం ప్రకటించింది. న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం–2026లో పాల్గొనేందుకు పుతిన్ భారత్కు వస్తున్నారని క్రెమ్లిన్ ప్రతినిధి యూరి ఉషకోవ్ తెలిపారు.
బ్రిక్స్ సమావేశానికి భారత్ ఆతిథ్యం
బ్రిక్స్ సమావేశానికి ఈసారి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమిగా గుర్తింపు పొందిన బ్రిక్స్ లో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో పుతిన్ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. సమావేశంలో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ భద్రత, వాణిజ్యం, ఇంధన రంగం వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.
ఏడాదిలో రెండోసారి భారత పర్యటన
ఇక ఏడాది వ్యవధిలో పుతిన్ భారత్ కు రెండోసారి రావడం విశేషం. గత ఏడాది డిసెంబర్ లో కూడా ఆయన న్యూఢిల్లీకి వచ్చారు. ఆ సమయంలో జరిగిన 23వ ఇండియా-రష్యా వార్షిక సదస్సులో పాల్గొన్నారు. ఆ సమావేశంలో రక్షణ, ఇంధన, వాణిజ్య రంగాలకు సంబంధించిన పలు కీలక ఒప్పందాలపై చర్చలు జరిగాయి. భారత్-రష్యా సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా రెండు దేశాలు ముందుకు సాగుతున్నాయి. ఇటీవల రష్యా విదేశాంగ మంత్రి సర్జే లావ్రోవ్ కూడా భారత్ లో పర్యటించారు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సంబంధాలు, గ్లోబల్ సౌత్ దేశాల పాత్రపై చర్చించినట్లు సమాచారం.
11కు చేరిన బ్రిక్స్ సభ్యదేశాల సంఖ్య
బ్రిక్స్ కూటమి మొదట బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలతో ప్రారంభమైంది. ప్రపంచ వేదికపై అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరాన్ని బలంగా వినిపించడమే లక్ష్యంగా ఏర్పడింది. తర్వాత కూటమి విస్తరణలో భాగంగా ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ కూడా సభ్యత్వం పొందాయి. ప్రస్తుతం బ్రిక్స్ సభ్య దేశాల సంఖ్య 11కి చేరింది. మొత్తంగా పుతిన్ పర్యటనతో భారత్-రష్యా సంబంధాలు మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.