బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ కేసులో కాంతారావుకు తాత్కాలికంగా ఉపశమనం లభించినట్లైంది.
అసలు వివాదం ఏంటి?
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో రేగా కాంతారావుపై ఓ యువతి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను లైంగికంగా వేధించారని ఆమె ఆరోపించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తనకు సంబంధించిన ప్రైవేట్ ఫొటోలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడ్డారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
ఇదే సమయంలో రియల్ ఎస్టేట్ వ్యవహారానికి సంబంధించి తన వద్ద నుంచి రూ.4 లక్షలు తీసుకుని మోసం చేశారని యువతి మరో ఆరోపణ చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే
తనపై నమోదైన కేసును సవాల్ చేస్తూ రేగా కాంతారావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కేసు వివరాలను పరిశీలించిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం.. ఆయనపై నమోదైన కేసును కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.
హైకోర్టు తాజా తీర్పుతో రేగా కాంతారావుకు ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
also read: 22A భూముల వ్యవహారంపై హరీశ్ రావు సంచలన ఆరోపణలు.. రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ
