క్రైమ్ మిర్రర్,తెలంగాణ :- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణకు చెందిన నేతలపై చేసిన విమర్శలకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్ర్టాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ అయ్య జాగీరా అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన పొన్నం.. ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల జాగీరు అని, నీ అయ్య జాగీరు కాదంటూ తెలంగాణ రోడ్డు, రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. గాంధీ భవనలో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ’మిస్టర్ పవన్ కల్యాణ్.. ఇది మా అయ్య జాగీరే’ అని పొన్నం మరోసారి స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ ఇక్కడికి వచ్చి పీకేదేంటీ.? అని ఆయన ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్ అన్న పొన్నం.. తన దగ్గర డబ్బులు ఉంటే తాను కూడా పవన్తో ఒక క్యారక్టర్ చేయిస్తానంటూ విమర్శించారు. తెలంగాణపై పవన్ కల్యాణ్ మరోసారి అక్కసు వెళ్లగక్కారని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గద్దర్కు కారు కొనిచ్చానంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చనిపోయిన వారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందన్న పొన్నం.. తనకు ఆంధ్రలోనే దిక్కు లేదని చెప్పుకున్నాడంటూ వ్యాఖ్యానించారు.
తెలంగాణను వ్యతిరేకించిన పవన్ కల్యాణ్..
గతంలో తెలంగాణ ఏర్పాటును పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారని, ఆ విషయాన్ని ప్రజలు మర్చిపోలేదని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేవారు. ఉద్యమ సమయంలోనూ ఆంధ్ర వాళ్లను తామేం అనలేదని, తాము ఆంధ్ర వాళ్లను ఏదో అన్నట్టు పవన్ కల్యాణ్ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. పార్లమెంటులో ఏ బిల్లు చేసినా తలుపులు మూసే పాస్ చేస్తాన్న విషయాన్ని గుర్తెరగాలని హితవు పలికిన పొన్నం.. కొండగట్టుకు ఇచ్చిన పైసుల మీ అయ్య జాగీరువా.? అని ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మీటింగ్ పెట్టడం గెలకడం కాదా.? అని ప్రశ్నించిన మంత్రి.. పవన్ కల్యాణ్ తిరిగితే జనాలు వస్తారని, ఓట్లేయరని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ వచ్చినా, పోయినా తమకేం సంబంధం లేదని, తెలంగాణ ఎప్పుడూ ఏపీ ప్రజలను స్వాగతిస్తూనే ఉంటుందన్నారు. సినిమా నటుడిగా ఎక్కడ తిరిగినా తమకేం ఇబ్బంది లేదన్న ఆయన.. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతినే చర్యలు చేయవద్దని హితవు పలికారు.