క్రైమ్ మిర్రర్ : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం చిమిర్యాల క్రాస్ రోడ్డు సమీపంలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. నల్లబండగూడెం గ్రామానికి చెందిన లింగాల ఇజ్రాయిల్ (59) శుక్రవారం రాత్రి కోదాడ నుంచి ఆటోలో స్వగ్రామానికి బయలుదేరాడు. చిమిర్యాల క్రాస్ రోడ్డు వద్దకు ఆటో చేరుకోగానే విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు ఆటోను ఢీకొట్టింది.
కారు ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇజ్రాయిల్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో డ్రైవర్ మేకల జయరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి జయరాజును చికిత్స కోసం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కోదాడ రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
also read: భారీ కట్నం ఇచ్చినా తీరని దాహం.. భర్త, అత్తింటి వేధింపులకు బలి
