క్రైమ్ మిర్రర్ : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో తీవ్ర కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుంటుక రమేష్ (39)పై కొందరు వ్యక్తులు దాడి చేసి హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. స్థానికుల కథనం ప్రకారం.. రమేష్పై బుధవారం మధ్యాహ్నం సుమారు ఎనిమిది మంది వ్యక్తులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన రమేష్ను అనంతరం చెరువు వైపు ఈడ్చుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అక్కడ మరోసారి దాడి చేయడంతో ఆయన మృతి చెందినట్లు ఆరోపిస్తున్నారు.
ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు చర్యలు చేపట్టారు. రమేష్పై దాడికి అసలు కారణం ఏమిటనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వ్యక్తిగత కక్షలు, గతంలో జరిగిన వివాదాలు లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. దాడికి పాల్పడిన వారిని గుర్తించి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెలుగులోకి తీసుకురావడానికి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో మడిపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.
also read : భార్యకు అడ్డంగా దొరికిన ఫోక్ ఆర్టిస్ట్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
