Tech Industry Shake-Up: కృత్రిమ మేధ (AI) రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నప్పటికీ, ప్రపంచంలోని పెద్ద ఐటీ కంపెనీలు ఉద్యోగులను తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇటీవల మైక్రోసాఫ్ట్, మెటా వంటి సంస్థలు కలిసి 20 వేలకుపైగా ఉద్యోగాల కోతను ప్రకటించాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది టెక్ రంగంలో పెద్ద మార్పులకు సంకేతంగా భావిస్తున్నారు.
2020 నుంచి 9 లక్షల ఉద్యోగాలకు చెక్
మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్, అల్ఫాబెట్ వంటి సంస్థలు ఈ ఏడాది ఏఐ మౌలిక సదుపాయాలపై సుమారు 700 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని భావిస్తున్నాయి. కానీ, అదే సమయంలో ఉద్యోగాల్లో కోతలు కొనసాగుతున్నాయి. సీఎన్బీసీ నివేదిక ప్రకారం, ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే 92 వేల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. 2020 నుంచి ఇప్పటి వరకు మొత్తం ఉద్యోగ కోతలు 9 లక్షలకు చేరుకున్నాయి.
మెటా తన సిబ్బందిలో సుమారు 10 శాతం మందిని అంటే.. దాదాపు 8 వేల మందిని తొలగించడంతో పాటు, ఖాళీగా ఉన్న 6 వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయడం నిలిపివేసింది. మరోవైపు మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ అవకాశం అందిస్తోంది.
ఇక నైక్ కంపెనీ 1,400 మందిని తొలగించనుంది. స్నాప్ సంస్థ 16 శాతం ఉద్యోగులను తీసివేసింది. సేల్స్ఫోర్స్ 4 వేల కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలను రద్దు చేసింది. ఒరాకిల్ కూడా ఏఐ డేటా సెంటర్ల విస్తరణ కోసం ఉద్యోగ కోతలు చేపడుతోంది.
ఏఐ ఇంజినీర్లకు పెరుగుతున్న డిమాండ్
ఒకవైపు సాధారణ ఐటీ ఉద్యోగాలు తగ్గుతున్నప్పటికీ, మరోవైపు ఏఐ ఇంజినీర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సేల్స్ ఫోర్స్ సీఈవో మార్క్ బెనియాఫ్ 1,000 మంది ఫ్రెషర్లను ఏఐ ప్రాజెక్టుల కోసం నియమించనున్నట్లు ప్రకటించారు. కొత్త గ్రాడ్యుయేట్లు, ఇంటర్న్స్కు అవకాశాలు కల్పిస్తూ ఏఐ రంగాన్ని మరింత విస్తరించేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయి.