హైదరాబాద్ మహానగర భవిష్యత్ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటికే కృష్ణా, మంజీరా, గోదావరి జలాలపై ఆధారపడుతున్న నగరానికి త్వరలో మల్లన్నసాగర్ జలాలు కూడా చేరనున్నాయి. వేగంగా విస్తరిస్తున్న నగర జనాభా, పెరుగుతున్న నీటి వినియోగం నేపథ్యంలో దీర్ఘకాలిక పరిష్కారంగా ప్రభుత్వం కొత్త ప్రణాళికను అమలు చేస్తోంది. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ను హైదరాబాద్ తాగునీటి అవసరాలకు అనుసంధానం చేస్తూ భారీ స్థాయిలో మంచినీటి పథకం పనులు కొనసాగుతున్నాయి. రాబోయే దశాబ్దాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ప్రణాళిక నగరానికి మరింత స్థిరమైన నీటి భద్రత కల్పించే దిశగా ముందుకు సాగుతోంది.
50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ తెలంగాణలో అతిపెద్ద నీటి వనరులలో ఒకటిగా నిలిచింది. ఇందులో సాగునీటి అవసరాల కోసం సుమారు 30 టీఎంసీల నీటిని వినియోగిస్తూ, మిగిలిన 20 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కేటాయించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం హైదరాబాద్కు కృష్ణా, మంజీరా, గోదావరి జలాల ద్వారా సరఫరా జరుగుతున్నప్పటికీ పెరుగుతున్న జనాభా కారణంగా భవిష్యత్తులో అదనపు వనరులు అవసరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మల్లన్నసాగర్ను ప్రత్యామ్నాయ ప్రధాన వనరుగా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే గోదావరి సుజల స్రవంతి పథకం ద్వారా ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి ప్రతి సంవత్సరం 10 టీఎంసీల నీరు నగరానికి అందుతున్నప్పటికీ, పెరుగుతున్న అవసరాల దృష్ట్యా మరింత సామర్థ్యంతో కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.4500 కోట్ల వ్యయంతో 198 కిలోమీటర్ల మేర భారీ పైప్లైన్ వ్యవస్థను నిర్మిస్తున్నారు. ప్రత్యేకత ఏమిటంటే మల్లన్నసాగర్లో సుమారు 5 టీఎంసీల డెడ్ స్టోరేజ్ సామర్థ్యం ఉండటం వల్ల కొన్ని ప్రాంతాల్లో అదనపు పంపింగ్ అవసరం లేకుండానే గ్రావిటీ విధానంలో నీటిని తరలించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యూటీ విధానంలో అమలు చేస్తున్నారు. తాగునీటి సరఫరాతో పాటు నగరంలో మూసీ పునరుజ్జీవనానికి కూడా ఈ నీటిని వినియోగించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. పనులను చేపట్టిన సంస్థ నిర్ణీత గడువుకంటే ముందుగానే పూర్తి చేయడంపై దృష్టి పెట్టినట్లు సమాచారం.
ఇక మరోవైపు హైదరాబాద్కు దశాబ్దాలుగా తాగునీరు అందిస్తున్న సింగూరు ప్రాజెక్టు ప్రస్తుతం మరమ్మతుల దశలోకి వెళ్లనుంది. గత 50 ఏళ్లుగా నగరానికి ప్రధాన నీటి వనరుగా కొనసాగిన ఈ ప్రాజెక్టులో అప్స్ట్రీమ్ నిర్మాణ భాగాలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. దీంతో సంబంధిత భద్రతా సంస్థలు అత్యవసర మరమ్మతులు చేపట్టాలని సూచించాయి. ప్రతి సంవత్సరం సుమారు 7 టీఎంసీల నీటిని సింగూరు నుంచి వినియోగిస్తున్న నేపథ్యంలో మరమ్మతుల కాలంలో నగరానికి నీటి కొరత రాకుండా ముందస్తు చర్యగా మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు.
ప్రస్తుతం సిద్దిపేట జిల్లా తుక్కాపూర్ గ్రామం నుంచి గజ్వేల్ నియోజకవర్గంలోని సిద్దాపూర్ వరకు పైప్లైన్ నిర్మాణం కొనసాగుతోంది. భవిష్యత్తులో మల్లన్నసాగర్లో నీటి మట్టాలు తగ్గిన పరిస్థితుల్లో పైన ఉన్న కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి కూడా నీటిని వినియోగించేలా ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం అధిక సామర్థ్యం కలిగిన పంపులను వినియోగించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. సాగునీటి అవసరాలను కొనసాగిస్తూ, మరోవైపు హైదరాబాద్కు దీర్ఘకాలిక తాగునీటి భద్రత కల్పించే లక్ష్యంతో మల్లన్నసాగర్ కీలక పాత్ర పోషించబోతోంది.
ALSO READ: 6 ఏళ్లలో 25 సినిమాలు.. ఇండస్ట్రీనే ఏలేసిన హీరోయిన్.. చివరకు తల్లి ఒడిలోనే..