జీడిమెట్ల, క్రైమ్ మిర్రర్: జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని చింతల్ అంబేద్కర్ నగర్లో మహిళ ప్రియుడిని కత్తితో గొంతు కోసి అతి కిరాతకంగా చంపేసిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. శివారెడ్డి (40) అనే వ్యక్తితో అరుణ (35) గత 10 ఏళ్లుగా సహజీవనం చేస్తోంది. ఆమె కొడుకు సాయిరత్నం(19) కూడా వీరితో పాటు నివసిస్తున్నాడు. ఇటీవలి కాలంలో అరుణను శివారెడ్డి వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. వేధింపులు తట్టుకోలేక అరుణ, తన కొడుకు సాయిరత్నంతో కలిసి శివారెడ్డిని హత్య చేసేందుకు ప్లాన్ చేసింది.
మటన్ కొట్టే కత్తితో శివారెడ్డి గొంతు కోసి చంపిన తల్లికొడుకులు.. మృతదేహాన్ని సంచిలో మూటగట్టి తరలించే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిన్న అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. ఈ ఘటనపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. పోలీసులు శివారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.