దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్కు ‘వారణాసి’ అనే టైటిల్ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ టైటిల్ చుట్టూ ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
‘వారణాసి’ అనే టైటిల్ను ముందుగానే తన బ్యానర్పై రిజిస్టర్ చేసుకున్న దర్శకుడు సుబ్బారెడ్డి, ఎలాంటి పారితోషికం లేకుండా ఈ పేరును రాజమౌళి చిత్రానికి ఇవ్వడం విశేషం. 2023లో ఈ టైటిల్పై కథా రూపకల్పన కూడా ప్రారంభించినప్పటికీ, అదే పేరును రాజమౌళి సినిమా కోసం అవసరమని తెలిసిన వెంటనే ఆయన పెద్ద మనసుతో ముందుకొచ్చారు.
తెలుగు సినిమా గౌరవం దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని సుబ్బారెడ్డి తెలిపారు. తన అభిమాన నటుడు మహేష్ బాబు, ప్రముఖ దర్శకుడు రాజమౌళి కలిసి చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
టైటిల్ను వ్యాపారంగా చూడలేదని, ఒక్క రూపాయి తీసుకోవాలనే ఆలోచన కూడా రాలేదని ఆయన స్పష్టం చేశారు. “టైటిల్ అనేది నాకు భావోద్వేగం. మంచి సినిమా కోసం ఇవ్వడం నాకు గర్వకారణం” అని పేర్కొన్నారు.
ఇండస్ట్రీ వర్గాలు కూడా ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నాయి. టైటిళ్ల విషయంలో పరస్పర సహకారం ఉండాలని, ఇది మంచి ట్రెండ్కు నాంది కావచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచుతుందని సినీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
also read: 20 ఏళ్ల మౌనం వహించిన భర్త… చివరికి తల్లిదండ్రుల్ని కలిపిన చిన్న కొడుకు
