హిమాచల్ ప్రదేశ్లోని అటల్ టన్నెల్ ఉత్తర ద్వారం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. రాజస్థాన్కు చెందిన పర్యాటకులు ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపుతప్పి నిర్మాణంలో ఉన్న వంతెనను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో కైలాష్ అనే పర్యాటకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం తీవ్రత ఎంతలా ఉందంటే, వంతెన నిర్మాణంలో ఉన్న ఇనుప కడ్డీలు వాహనాన్ని చీల్చుకుంటూ లోపలికి దూసుకెళ్లాయి. దీంతో వాహనంలో ఉన్నవారు అందులోనే చిక్కుకుపోయారు.
పోలీసుల వివరాల ప్రకారం, పర్యాటకులు మనాలి నుంచి లాహౌల్ వైపు ప్రయాణిస్తున్నారు. రాత్రి సమయంలో అటల్ టన్నెల్ దాటి కొద్దిసేపటికే వాహనం అధిక వేగంతో ఉండటంతో డ్రైవర్ మలుపును సరిగా అంచనా వేయలేకపోయాడు. దీంతో వాహనం అదుపుతప్పి చంద్ర నది వైపు దూసుకెళ్లి నిర్మాణంలో ఉన్న వంతెనను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఆదిత్య, రాజస్థాన్కు చెందిన రాజేంద్ర, అలాగే డ్రైవర్ సిద్ధార్థ్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం పంపించారు.
ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. వంతెన స్తంభానికి వేలాడుతూ కనిపించిన వాహనం పరిస్థితి ఈ ఘటన తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తోంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అధిక వేగం, రాత్రి డ్రైవింగ్ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
also read: ‘జిహాదీ’ వ్యాఖ్యల వివాదం: నటుడు టిని టామ్పై కేసు నమోదు చేయాలన్న కోర్టు