తప్పు చికిత్స కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటనలో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కీలక తీర్పు ఇచ్చింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ మృతురాలి కుటుంబానికి మొత్తం రూ.2 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. రిటైర్డ్ జస్టిస్ ఏపీ సాహి, భరత్కుమార్ పాండ్యాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించి మే 18న తీర్పు వెలువరించింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ఈ కేసు ఉత్తర్ప్రదేశ్లోని అలీఘర్కు చెందిన ఓ మహిళకు సంబంధించినది. 2012లో ఆమె కడుపు నొప్పితో స్థానిక నర్సింగ్ హోమ్లో చేరింది. వైద్యులు పరీక్షలు చేసి కుడి కిడ్నీలో సమస్య ఉందని చెప్పారు. ఆ కిడ్నీని తొలగించాల్సి ఉంటుందని కుటుంబసభ్యులకు వివరించారు. అనంతరం మే 6న ఆమెకు శస్త్రచికిత్స చేశారు.
ఆపరేషన్ తర్వాత కూడా మహిళ ఆరోగ్యం మెరుగుపడలేదు. డయాలసిస్ చేయించుకుంటున్నప్పటికీ కడుపునొప్పి తగ్గకపోవడంతో కుటుంబసభ్యులు మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు షాకింగ్ విషయాన్ని గుర్తించారు. సమస్య ఉన్న కుడి కిడ్నీ అలాగే ఉండగా, ఆరోగ్యంగా ఉన్న ఎడమ కిడ్నీని తొలగించినట్లు తేలింది.
దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఆస్పత్రి, వైద్యులపై కేసు పెట్టింది. అయితే కిడ్నీ సమస్యలు మరింత తీవ్రమవడంతో ఆమె 2014లో మరణించింది. అనంతరం కుటుంబసభ్యులు కన్సూమర్ కోర్టును ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు.
భారీ జరిమానా విధించిన వినియోగదారుల కమిషన్
కేసును విచారించిన కమిషన్ వైద్యుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని అభిప్రాయపడింది. ఒక తల్లి, భార్య, గృహిణిని కుటుంబం నుంచి దూరం చేసిన నష్టాన్ని డబ్బుతో భర్తీ చేయలేమని వ్యాఖ్యానించింది. అయినప్పటికీ బాధిత కుటుంబానికి న్యాయం జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ మేరకు వైద్య నిర్లక్ష్యానికి గాను రూ.1.5 కోట్లు, కుటుంబంలోని నలుగురు ఫిర్యాదుదారులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.40 లక్షలు, కోర్టు ఖర్చుల కోసం మరో రూ.1 లక్ష చెల్లించాలని డాక్టర్ను ఆదేశించింది.