హైదరాబాద్, క్రైమ్మిర్రర్: ప్రైవేటు , కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగాలు పొందాలనుకునే యువతకు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన డీట్ యాప్ ఒక వరంలా మారింది. డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారితో పాటు చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ యాప్ ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని పేరు, విద్యార్హతలు నమోదు చేసుకుంటే, అభ్యర్థుల అర్హతలకు అనుగుణంగా ఇంటర్వ్యూల సమాచారం నేరుగా అందుతుంది.
డీట్ సాధించిన విజయాలు…
నిరుద్యోగులకు , సంస్థలకు మధ్య వంతెనగా నిలుస్తున్న ఈ యాప్ ద్వారా ఇప్పటివరకు, 40,472 మంది అభ్యర్థులు యాప్లో పేర్లను నమోదు చేసుకున్నారు. 22,244 మంది జాబ్ మేళాలకు హాజరయ్యారు. 11,271 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు షార్ట్ లిస్ట్ అయ్యారు.
అవగాహన , శిక్షణ…
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో డీట్ యాప్పై నిరుద్యోగులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. కేవలం ఉద్యోగ సమాచారమే కాకుండా, కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకునే కోర్సుల వివరాలను కూడా డీట్ అధికారులు అందజేస్తున్నారు. మూడు జిల్లాల్లో ఆరు నెలల వ్యవధిలోనే సుమారు 2 వేల మందికి వివిధ స్థాయిల్లో ఉద్యోగాలు లభించడం
విశేషంప్రభుత్వ, ప్రైవేటు , స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే జాబ్ మేళాలకు డీట్ అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులకు ఇంటర్న్షిప్లు కూడా ఇప్పిస్తున్నామని డీట్ సంచాలకులు జె. రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 1 నుండి 12 వరకు నిర్వహించిన జాబ్ మేళాలకు వందలాది మంది అభ్యర్థులు హాజరై తమ వివరాలను నమోదు చేసుకున్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.