హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: నగరంలోని కాసుల బ్రహ్మనంద రెడ్డి నేషనల్ పార్క్లో బుధవారం ఉదయం 8 గంటలకు భూమి దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. “లీడ్ ఇండియా ఫౌండేషన్” ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా సాగింది. నగరంలోని ప్రకృతి మధ్యలో నిర్వహించిన ఈ కార్యక్రమం పర్యావరణ ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా “లీడ్ ఇండియా “ వ్యవస్థాపకులు డాక్టర్ బి. ఎన్. సుదర్శన్ ఆచార్య ప్రధాన అతిథిగా పాల్గొని మాట్లాడారు. “భూమి మనకు ఇచ్చిన వరాలు అమూల్యమైనవి. వాటిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు భవిష్యత్ తరాలకు తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయి” అని అన్నారు.
ప్రతి వ్యక్తి తన దైనందిన జీవితంలో చిన్న మార్పులు తీసుకువస్తే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.అదేవిధంగా, లీడ్ ఇండియా అసోసియేషన్ ప్రెసిడెంట్ “విస్తరాకు వేణు” మాట్లాడుతూ, “ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మాణమే లీడ్ ఇండియా ఫౌండేషన్ ముఖ్య లక్ష్యం. ప్లాస్టిక్ వినియోగం వల్ల నేల, నీరు, గాలి కలుషితమవుతున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను అనుసరించాలి” అని పిలుపునిచ్చారు.
నిర్వాహకురాలు డాక్టర్ . సంధ్య రాణి మాట్లాడుతూ, “ప్రత్యామ్నాయ భూగోళాన్ని మనం సృష్టించలేము. అందుకే ఈ భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రకృతిని కాపాడితేనే మన జీవితం సురక్షితంగా ఉంటుంది” అని పేర్కొన్నారు. పర్యావరణంపై అవగాహన పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు “అవర్ పవర్.. అవర్ ప్లానెట్” అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణకు తమ మద్దతు తెలియజేశారు.
భూమిని కాపాడటం మన అందరి బాధ్యత అనే సందేశాన్నిఈ కార్యక్రమం స్పష్టంగా తెలియజేసింది. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో సుస్థిరమైన మార్పుకు దోహదపడతాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.