క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) మరియు మహిళా రిజర్వేషన్లపై నిన్న ఏప్రిల్ 14న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి ఒక బహిరంగ లేఖ రాశారు. లోక్సభ సీట్ల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలగకూడదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ‘హైబ్రిడ్ మోడల్’ ద్వారా జాతీయ ఏకాభిప్రాయం సాధించాలని ఆయన సూచించారు. మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టవద్దని కోరారు.
వీటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కీలక అంశాలపై అన్ని రాష్ట్రాలు మరియు రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడానికి తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరారు. నియోజకవర్గాల పెంపులో ప్రస్తుతం ఉన్న ‘ప్రొ-రేటా’ (Pro-rata) విధానం దక్షిణాది ప్రజలకు ఆమోదయోగ్యం కాదని, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ముందుకు వెళ్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని లేఖలో హెచ్చరించారు.
