హైదరాబాద్ నగర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గోల్కొండ బోనాల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా లంగర్హౌస్ పరిసరాల్లో భక్తి వాతావరణం నెలకొంది. శ్రీ గోల్కొండ జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రభుత్వం తరఫున మంత్రులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి తొలి బంగారు బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయాన్ని అనుసరిస్తూ కొండా సురేఖ బోనం ఎత్తి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రభుత్వం తరఫున రూ.11 లక్షల ఆర్థిక సహాయాన్ని ఆలయ కమిటీకి అందించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గోల్కొండ బోనాల సందర్భంగా లంగర్హౌస్ ప్రాంతం మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ సంప్రదాయాలు, జానపద కళలను ప్రతిబింబించే ఈ వేడుకలను చూసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.
కాగా, గోల్కొండ బోనాలు తెలంగాణలో జరిగే ఆషాఢ బోనాల ఉత్సవాలకు ఆరంభ వేడుకగా భావిస్తారు. చారిత్రక గోల్కొండ కోట వేదికగా జరిగే ఈ ఉత్సవాలకు ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు హాజరవుతారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు, భక్తులకు సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు అద్దం పట్టే గోల్కొండ బోనాల జాతరతో నగరంలో పండుగ సందడి మొదలైంది. రానున్న రోజుల్లో జరిగే ఉత్సవాల్లో మరింత మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది.
also read: ప్రియుడితో వివాదం… ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య – అల్లూరి జిల్లాలో విషాదం