క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: దర్శకుడు వశిష్ట.. బింబిసార సినిమాతో మంచి గుర్తింపు పొందాడు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కథ, విజువల్స్ అన్నీ కొత్తగా ఉండటంతో ఈ సినిమా మంచి విజయం సాధించింది. దీంతో వశిష్ట పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీలో బాగా వినిపించింది. ఆ తర్వాత అతని తదుపరి సినిమాలపై అంచనాలు పెరిగాయి.
ఈ విజయంతో వశిష్టకు మెగాస్టార్ చిరంజీవితో పని చేసే అవకాశం వచ్చింది. విశ్వంభర అనే భారీ ప్రాజెక్ట్.. ప్రకటించగానే పెద్ద హైప్ వచ్చింది. ఒక యువ దర్శకుడు.. ఒక సీనియర్ స్టార్ కలయిక కావడంతో ఈ సినిమా మీద అందరి దృష్టి పడింది. కానీ ఈ సినిమా అనేక కారణాలతో ఆలస్యం అవుతోంది. విడుదల తేదీ కూడా పలుమార్లు మారింది.
ఇలాంటి సమయంలో వశిష్ట తన తదుపరి ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడు. ఇటీవల ఆయన నందమూరి బాలకృష్ణను కలిసి ఒక కథ చెప్పాడంట. ఆ కథ బాలకృష్ణకు నచ్చిందని, ఆయన కూడా ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపుతున్నారని సమాచారం.
మోక్షజ్ఞ కన్నా బాలకృష్ణ ముందు..!
ఇదే సమయంలో వశిష్ట, మోక్షజ్ఞకు సంబంధించిన కథను కూడా చర్చించాడట. కానీ ముందుగా తనతో ఒక సినిమా చేయాలని బాలకృష్ణ సూచించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బాలకృష్ణ చాలా బిజీగా ఉన్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. త్వరలో విజయ్ కనకమేడలతో మరో సినిమా ప్రారంభం కానుంది. అలాగే వివేక్ ఆత్రేయతో కూడా ఒక ప్రాజెక్ట్ ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు వశిష్ట ముందుగా రామ్ చరణ్తో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అది జరగలేదు. తర్వాత చిరంజీవితో పని చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు బాలకృష్ణతో కూడా సినిమా చేసే అవకాశం రావడంతో వశిష్ట కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.
