* వెబ్ సైట్ లో పెట్టిన తెలంగాణ ప్రభుత్వం
* దేశానికి రోల్ మోడల్ గా రేవంత్ సర్కార్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: దేశంలో తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా? కుల గణన విషయంలో ఆదర్శంగా నిలిచిందా? కేంద్ర ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పెట్టిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కుల గణన వివరాలను బయట పెట్టింది. అయితే ఇప్పుడే ఎందుకు అనే అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగాద్ సత్య నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ కుల గణనకు సంబంధించిన డేటాను ఇటీవల వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అయితే ఇది సామాజిక బాధ్యతగా కాదు. పక్కా రాజకీయ వ్యూహంతోనే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా జాతీయస్థాయిలో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ అస్త్రాన్ని బయటకు తీయడం విశేషం.
జనగణన ప్రారంభం..
ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ సర్కార్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ తరుణంలో కుల గణన కూడా చేపట్టాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కేవలం 50 రోజుల్లోనే 1.12 కోట్ల కుటుంబాల డేటాను సేకరించగలిగింది తెలంగాణ సర్కార్. విజయవంతంగా వెబ్సైట్లో పొందుపరిచింది. తక్కువ రోజుల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తున్నది.. కేంద్ర ప్రభుత్వం చేయలేదా? అనే ప్రశ్న ఉత్పన్నమయ్యేలా చేసింది తెలంగాణ సర్కార్. ఈ డేటా ద్వారా సామాజిక న్యాయం సాధించడంలో తాము దేశానికి రోల్ మోడల్ అని చాటుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ బలమైన వ్యూహంతోనే పనిచేసింది.
కులాల పట్టు చూపేందుకు..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా డీ లిమిటేషన్ ఫీవర్ కొనసాగుతోంది. మరోవైపు ఈ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన పెరుగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన సీట్ల విభజన జరిగితే.. దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ బలం తగ్గిపోతుందనే ఆందోళన ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో శాస్త్రీయమైన కుల గణన వివరాలు చేతిలో ఉంటే.. సామాజిక వర్గాల వారు తమ వాటాలను డిమాండ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బలమైన ఆధారం దొరుకుతుంది. 56% ఉన్న బీసీలు, మెజారిటీగా ఉన్న మాదిగ సామాజిక వర్గాల గణాంకాలు ఇప్పుడు రాజకీయాల్లో కొత్త సమీకరణలకు దారితీస్తాయి.
రేవంత్ సర్కార్ పక్క రాజకీయ వ్యూహంతోనే ఈ ఎత్తుగడ వేసినట్లు అర్థమవుతోంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈ నివేదిక అధికార కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచంల పనిచేసే అవకాశం ఉంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదనకు ఈ సర్వే ఫలితాలు చట్టబద్ధతను కల్పిస్తాయి. ఈ సామాజిక వర్గం ఎంత వెనుకబడి ఉందో లెక్కలతో సహా నిరూపించడం ద్వారా.. సంక్షేమ పథకాల కేటాయింపులో పూర్తిగా వారికి న్యాయం చేయవచ్చు. అయితే జాతీయ రాజకీయాలను షేక్ చేసేలా తెలంగాణ ప్రభుత్వం ఈ కులగణను తెరపైకి తేవడం మాత్రం హాట్ టాపిక్.
