క్రైమ్ మిర్రర్, సినిమా:- బాలీవుడ్లో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్గా మారిన డాన్ 3 వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్టార్ హీరో రణ్వీర్ సింగ్పై విధించిన నాన్-కోఆపరేషన్ డైరెక్టివ్ను ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్డబ్ల్యూఐసీఈ) అధికారికంగా ఉపసంహరించుకుంది. దీంతో రణ్వీర్కు భారీ ఊరట లభించినట్టైంది.భారీ అంచనాల మధ్య తెరకెక్కనున్న డాన్ 3 చిత్రంలో రణ్వీర్సింగ్ హీరోగా నటించనున్నట్లు ప్రకటించగానే దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్రముఖ దర్శకుడు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. అయితే షూటింగ్ ప్రారంభానికి ముందు రణ్వీర్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే వార్తలు రావడంతో వివాదం మొదలైంది.
ఇప్పటికే సెట్స్ నిర్మాణం, విదేశీ లొకేషన్ బుకింగ్స్, సాంకేతిక ఏర్పాట్లు, ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి దశకు చేరుకున్న సమయంలో హీరో తప్పుకోవడం నిర్మాతలకు పెద్ద షాక్గా మారింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ పరిణామం వల్ల సుమారు రూ.45 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు ప్రచారం జరిగింది. దీంతో సినీ కార్మిక సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి.అయితే ఈ ఆరోపణలపై రణ్వీర్ సింగ్ టీమ్ తమ వాదన వినిపించింది. ప్రాజెక్ట్కు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ తమకు అందలేదని, కథ విషయంలో స్పష్టత లేకపోవడంతోనే సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. అలాగే ఎలాంటి అడ్వాన్స్ చెల్లింపులు జరగలేదని, ఇది పూర్తిగా నటుడు-నిర్మాతల మధ్య ఉన్న ఒప్పందానికి సంబంధించిన అంశమని పేర్కొంది.తాజా పరిణామాల నేపథ్యంలో ఎఫ్డబ్ల్యూఐసీఈ అధ్యక్షుడు బీఎన్ వారీ మాట్లాడుతూ, పరిశ్రమలో ఎవరిపైనా శాశ్వత నిషేధం విధించే అధికారం తమకు లేదని స్పష్టం చేశారు. ఈ వివాదాన్ని పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని రణ్వీర్ సింగ్, నిర్మాతలకు సూచించారు. ప్రముఖ సినీ ప్రముఖుడు అశోక్ పండిట్ కూడా ఇరు వర్గాలు మాట్లాడుకుని సమస్యను ముగించుకోవాలని అభిప్రాయపడ్డారు.
నిషేధం ఎత్తివేయడంతో ఇప్పుడు అందరి దృష్టి డాన్ 3 భవిష్యత్తుపైనే ఉంది. రణ్వీర్ సింగ్ మళ్లీ ఈ ప్రాజెక్ట్లో చేరతారా? లేక నిర్మాతలు కొత్త హీరో కోసం వెతుకుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే ఈ వివాదం త్వరలోనే ముగింపు దశకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.