అయోధ్యలోని శ్రీరామ మందిరంలో విరాళాల దుర్వినియోగం, నగదు మరియు విలువైన వస్తువుల మాయం కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆలయ భద్రతా వ్యవస్థలో కొన్ని అనుమానాస్పద అంశాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీలో మార్పులు జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మూడు రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో విస్తృత తనిఖీలు నిర్వహించిన సిట్ అధికారులు భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ రికార్డులు, నిఘా వ్యవస్థ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్ శంకర్ అలియాస్ టిన్ను యాదవ్ ను కూడా పలుమార్లు ప్రశ్నించినట్లు సమాచారం.
11 నెలల్లో ఆలయ భద్రత కోసం రూ.10 కోట్ల ఖర్చు
దర్యాప్తులో భాగంగా గత 11 నెలల్లో ఆలయ భద్రత కోసం సుమారు రూ.10 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు వెల్లడైంది. అంత పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించినప్పటికీ విరాళాల పెట్టెల నుంచి డబ్బు, నగలు మాయం కావడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో భద్రతా వ్యవస్థలో ఎక్కడైనా లోపాలు ఉన్నాయా? లేదా? కొందరు సిబ్బంది ప్రమేయం ఉందా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
అంతేకాకుండా విరాళాల లెక్కింపు ప్రక్రియను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. లెక్కింపులో పాల్గొన్న బ్యాంకు సిబ్బంది, ట్రస్ట్ ఉద్యోగుల పాత్రపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కొన్ని సందర్భాల్లో ట్రస్ట్ సిబ్బంది కంటే బ్యాంకు అధికారులే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం బయటకు వచ్చింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఆలయ ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, గేట్ చెకింగ్ సిబ్బంది, సీసీటీవీ పర్యవేక్షకుల సేవా రికార్డులను సిట్ అధికారులు సేకరిస్తున్నారు. ఘటన వెనుక ఒక పెద్ద నెట్ వర్క్ పనిచేసి ఉండవచ్చనే అనుమానంతో విచారణను మరింత విస్తరించారు.
200 మందిని విచారించనున్న సిట్
ఈ కేసుకు సంబంధించి దాదాపు 200 మంది వ్యక్తుల జాబితాను సిద్ధం చేసిన అధికారులు ఇప్పటికే 125 మందికి పైగా వ్యక్తులను ప్రశ్నించినట్లు సమాచారం. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.