అమెరికాలో మరో భారతీయుడు దుండగుడి కాల్పులకు బలయ్యారు. టెన్నెస్సీ రాష్ట్రంలోని జాక్సన్ నగరంలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. గుజరాత్కు చెందిన 56 ఏళ్ల సురేష్ పటేల్ తన కుమార్తెతో కలిసి షాపులో ఉన్న సమయంలో దోపిడీకి వచ్చిన ఓ వ్యక్తి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. తండ్రిపై జరిగిన కాల్పులను కుమార్తె కళ్లారా చూడాల్సి రావడం విషాదాన్ని మరింత పెంచింది.
పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో సురేష్ పటేల్ నిర్వహిస్తున్న ‘రిడ్జ్క్రెస్ట్ సెల్లార్స్’ దుకాణంలోకి మాస్క్ ధరించిన ఓ వ్యక్తి ప్రవేశించాడు. తుపాకీ చూపించి నగదు ఇవ్వాలని బెదిరించాడు. డబ్బు తీసుకున్న అనంతరం అక్కడి నుంచి వెళ్లే ముందు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సురేష్ పటేల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సురేష్ పటేల్ ఇటీవలే ఈ దుకాణాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుడు గ్రే రంగు హూడీ, జీన్స్ ధరించి ఉన్నట్లు గుర్తించారు. కాల్పుల అనంతరం తెల్లటి కారులో అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జాక్సన్ పోలీసులు నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. దోపిడీ సమయంలో కాల్పులు ఎందుకు జరిపాడనే అంశంతో పాటు నిందితుడి గుర్తింపు, పరారైన వాహనం వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
also read: సుమంత్ కేసులో కీలక పరిణామం.. వ్యక్తిగత డ్రైవర్ అరెస్ట్
