విజయవాడ, క్రైమ్ మిర్రర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా నియమితులయ్యే అవకాశం ఉంది. ఈ పోస్ట్కు పునేఠా పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పునేఠా నియామకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే గవర్నర్ ద్వారా నియామక ప్రక్రియ పూర్తిచేయనున్నట్లు సమాచారం. పునేఠా 2019 ఎన్నికలకు ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. అయితే 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ ఫిర్యాదుతో కేంద్ర ఎన్నికల సంఘం ఆయన్ను సీఎస్ పోస్టు నుంచి తప్పించగా.. ఆ తర్వాత ఆయన రిటైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ను విజిలెన్స్ కమిషనర్గా నియమించారు.
తాజాగా ఎన్నికల కమిషనర్గా పునేఠా సేవల్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నీలం సాహ్ని పదవీకాలం మార్చి నెలాఖరుతో ముగిసిన సంగతి తెలిసిందే. ఆ స్థానంలో పునేఠాకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పునేఠా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా బాధ్యతలు అప్పగిస్తే.. విజిలెన్స్ కమిషనర్గా మరో రిటైర్డ్ ఐఏఎస్, మాజీ సీఎస్ నీరభ్ కుమార్ను నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.అనిల్ చంద్ర పునేఠా సొంత రాష్ట్ర ఉత్తరాఖండ్. ఎకనమిక్స్లో గ్రాడ్యుయేషన్ చేసిన ఆయన.. రూరల్ డెవలప్మెంట్లో పీజీ చదివారు. ఎల్ఎల్బీ కూడా పూర్తి చేశారు.
1984 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన పునేఠా.. కడప జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడం ద్వారా ఐఏఎస్ అధికారిగా తన కెరీర్ను ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా పని చేసిన సమయంలో ఆయన వరుసగా మూడుసార్లు ఉత్తమ కలెక్టర్గా అవార్డు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా, భూపరిపాలన ప్రధాన కమిషనర్ గా, ఉద్యాన, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్గా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానూ ఆయన పనిచేశారు2018 సెప్టెంబర్లో నాటి టీడీపీ ప్రభుత్వం అనిల్ చంద్ర పునేఠాకు సీఎస్గా బాధ్యతల్ని అప్పగించింది.
అయితే 2019 ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్సీ డీజీ బదిలీ విషయంలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో జాప్యం చేశారనే కారణంతో.. చీఫ్ సెక్రటరీ పదవి నుంచి ఆయన్ను తప్పించింది. ఎల్వీ సుబ్రహ్మణ్యంను నూతన సీఎస్గా నియమించింది. ఆ తర్వాత పునేఠా ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా పని చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గానూ ఆయన పని చేశారు.
