Actress Aditi Maker: సినీ రంగంలో మహిళల దుస్తులపై వివాదం మరోసారి మొదలైంది. నటుడు శివాజీ గతంలో హీరోయిన్ల దుస్తులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ పూర్తిగా చల్లారకముందే మళ్లీ చర్చకు దారి తీస్తున్నాయి. ఒక సినీ వేడుకలో నిధి అగర్వాల్ ధరించిన దుస్తులపై ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలకు కారణమయ్యాయి. మహిళలు మర్యాదగా దుస్తులు ధరించాలని ఆయన చేసిన సూచన సినీ పరిశ్రమలో విభేదాలకు తెరతీసింది. ఆ వ్యాఖ్యలపై పలువురు మహిళా ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా చిన్మయి, అనసూయ వంటి వారు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించడంతో వివాదం మరింత వేడెక్కింది.
ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడిచింది. కొందరు శివాజీ వ్యాఖ్యలకు మద్దతు తెలపగా, మరికొందరు మాత్రం మహిళల దుస్తుల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని మండిపడ్డారు. ఈ వివాదం మహిళా సంఘాల దృష్టికి కూడా వెళ్లి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. చివరకు శివాజీ మహిళలకు క్షమాపణలు తెలియజేయడంతో విషయం ముగిసిందని అనుకున్నారు. అయితే కాలక్రమంలో ఈ అంశం మళ్లీ మళ్లీ వెలుగులోకి వస్తూనే ఉంది.
ఇప్పుడీ వివాదంపై మరోసారి స్పందిస్తూ అమీ తుమీ చిత్రంలో నటించిన అదితి మ్యాకల్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. శివాజీ పట్ల వ్యక్తిగతంగా గౌరవం ఉన్నప్పటికీ మహిళల దుస్తులపై వ్యాఖ్యానించడం సరైంది కాదని స్పష్టం చేశారు. గతంలో శివాజీ నటించిన చిత్రాల్లో కూడా పలువురు మహిళలు బొల్డ్గా డ్రెస్లు ధరించారని, అప్పుడు ఎందుకు ఎవరూ ప్రశ్నించలేదని ఆమె ప్రశ్నించారు. తాము ధరించే దుస్తులే తమ జీవనోపాధికి ఆధారమని, అది తమ వృత్తి భాగమని పేర్కొన్నారు.
తాను వ్యక్తిగత జీవితంలో మర్యాదలు పాటిస్తానని, బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటానని తెలిపారు. గతంలో ఒకసారి సినిమా ప్రమోషన్లో భాగంగా బస్సులో ప్రయాణిస్తుండగా ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె బయటపెట్టారు. ఒక వ్యక్తి బస్సు అద్దం ద్వారా చెయ్యి చాపి తన ఛాతీ మీద చేయి పెట్టి నీచంగా ప్రవర్తించాడని చెప్పింది. ఆ సమయంలో తీవ్ర ఆందోళనకు గురై ఏం చేయాలో అర్థం కాక తడబడిపోయానని చెప్పుకొచ్చారు. మహిళలు బయట ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని, అలాంటి పరిస్థితుల్లో వారిని దుస్తుల పేరుతో విమర్శించడం మరింత బాధ కలిగిస్తుందని అన్నారు.
అమ్మాయిలను తీర్పు చేయడం మానుకోవాలని, ఉచిత సలహాలు అవసరం లేదని ఆమె ఘాటుగా పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు అవసరం లేకుండా దుస్తులపై వ్యాఖ్యలు చేస్తారని, కొన్ని సందర్భాల్లో మహిళలే మహిళలను విమర్శించడం బాధాకరమని చెప్పారు. మొత్తంగా అదితి మ్యాకల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మరోసారి ఈ చర్చకు తెరతీశాయి. ఆమె అమీ తుమీ, ఏకం, రాధ, షాదీ ముబారక్ వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
ALSO READ: అత్తామామలకు విషమిచ్చి డబ్బుతో అల్లుడు పరార్
