క్రైమ్ మిర్రర్ : గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటేనే హోర్ముజ్ జలసంధిని తెరుస్తామని, లేనిపక్షంలో దానిని మూసివేసే ఉంచుతామని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ ముహమ్మద్ బాఘెర్ గాలిబఫ్ శుక్రవారం పార్లమెంటు వేదికగా అధికారికంగా ప్రకటించారు. తమ దేశ హక్కులను గుర్తించి, ఒప్పందం ప్రకారం వ్యవహరించే వరకు అమెరికాతో ఎటువంటి చర్చలు ఉండబోవని ఆయన తేల్చిచెప్పారు.
మధ్యవర్తుల ద్వారా తమ సందేశాన్ని ఇప్పటికే అమెరికాకు స్పష్టంగా చేరవేశామని గాలిబఫ్ తెలిపారు. ఏకపక్ష ధోరణి, నమ్మకద్రోహానికి ఇకపై కాలం చెల్లిందని శత్రుదేశం గ్రహించాలని ఆయన హెచ్చరించారు. గతంలో కుదిరిన అవగాహన ప్రకారం ఇరాన్ ఓడరేవులపై విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, ఆర్థిక ఆంక్షలను తొలగించడం, విదేశాల్లో నిలిపివేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, సైనిక చర్యలు మరియు బెదిరింపులకు ముగింపు పలకడం వంటి కీలక డిమాండ్లను నెరవేర్చాలని ఇరాన్ షరతులు విధించింది.
అణు కార్యక్రమం, పశ్చిమాసియా భద్రతపై సమగ్ర చర్చల కోసం జూన్ నెలలో ఇరు దేశాల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. కాల్పుల విరమణ అమలులోకి వచ్చిన తర్వాత 60 రోజుల్లోగా శాశ్వత శాంతి ఒప్పందాన్ని ఖరారు చేయాలని భావించారు. అయితే, హోర్ముజ్ జలసంధి గుండా నౌకాయానంపై ఇరు దేశాల మధ్య విభేదాలు తీవ్రమవడంతో జులై 7న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందం రద్దయినట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఇరాన్ కూడా ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించింది. దీనితో ఇరు దేశాల మధ్య పరస్పర దాడులు తీవ్రమై పశ్చిమాసియా ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి.
also read : ప్రేమ, ఈర్ష్యతోనే యువతి మర్డర్.. లెక్చరర్తో పాటు మరో వ్యక్తి అరెస్ట్!
