-
బిఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకుడి విషాదాంతం
-
తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణం
-
ఆదుకోలేక పోయిన రాజకీయం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: రాజకీయాలంటే ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. తెల్లటి చొక్కా, ఖరీదైన వాహనం.. దర్జా వెలగబెడుతుంటారు. కానీ ఓ స్థాయినేత వరకు అయితే ఓకే. గ్రామస్థాయి, ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం ఆర్థిక ఇబ్బందులు పడుతుంటారు. సమాజంలో హోదా కోసం పరితపిస్తుంటారు. ఈ క్రమంలో కుటుంబాన్ని పణంగా పెడుతుంటారు. అటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావడంతో తెలంగాణలోని ఓ బిఆర్ఎస్ మండల నాయకుడు ఏకంగా బలవన్మరణానికి పాల్పడ్డాడు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం బిఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు సింహాచలం జగన్ ఆత్మహత్య చేసుకున్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారంతో బలవన్మరణానికి పాల్పడడం విషాదం నింపింది. రాజకీయాల కోసం అంకిత భావంతో పనిచేసి.. పార్టీ కార్యక్రమాల నిమిత్తం విపరీతంగా ఖర్చుపెట్టిన ఆయన.. ఆ తరువాత కూరుకుపోయిన అప్పుల ఊబి నుంచి బయటపడలేక ప్రాణాలు వదలడం కలచివేసింది.
సూసైడ్ నోట్ వైరల్…
Also Read: పెద్దపల్లి జిల్లాలో విషాదం.. ప్రైవేటు ఆస్పత్రి వైద్యుడు ఆత్మహత్య
మృతుడు జగన్ తన మరణానికి ముందు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆవేదన అందరిని ఆలోచింపచేస్తోంది. తాను బతికి ఉన్నంతకాలం కుటుంబానికి ఆర్థికంగా ఏమీ చేయలేకపోయానని.. కనీసం ఈఎంఐలు కూడా కట్టలేని స్థితిలోకి వచ్చేసానని.. ఒత్తిడి భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. తన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ లేఖలు ఆయన వేడుకోవడం క్షేత్రస్థాయి నాయకుల దయనీయ పరిస్థితిని తెలియజేస్తోంది. పార్టీల కోసం సర్వస్వం త్యాగం చేసే కిందిస్థాయి కార్యకర్తలు, నాయకులకు చివరికి కనీసం ఆసరా కూడా దక్కట్లేదు అనేందుకు ఈ ఘటన ఒక ఉదాహరణ.
ఆర్థిక స్థిరత్వం కోల్పోయి…
Also Read:భర్త వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య.. పెళ్లైన మూడు నెలలకే విషాదం
పై స్థాయి రాజకీయాలు వేరు.. మండల,గ్రామస్థాయి రాజకీయాలు వేరు. ఆశ కోసం, ఆశయం కోసం, ప్రజాసేవ పేరుతో జెండాలు మోసి నిత్యం తిరిగే సామాన్య కార్యకర్తలు రాజకీయ వ్యవస్థలో తమ వ్యక్తిగత జీవితాలను, ఆర్థిక స్థిరత్వాన్ని ఎలా కోల్పోతున్నారు చెప్పడానికి సింహాచలం జగన్ ఉదంతం ఒక నిలువెత్తు నిదర్శనం. కేవలం నమ్మకంతో పార్టీల వెంట నడిచే నాయకులు చివరికి కనీస కుటుంబ భద్రతను కూడా కరువవుతున్నారన్న దుస్థితి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ సంఘటన రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు, కిందిస్థాయి నాయకులకు ఒక కఠినమైన హెచ్చరిక లాంటిది. వ్యవస్థలో ఉంటూ ఆర్థికంగా నిలదొక్కుకో లేకపోతే కుటుంబ భవిష్యత్తును కూడా కాపాడుకోలేని పరిస్థితి. అటువంటి రాజకీయ ప్రయాణం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. అదే సమయంలో పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు కచ్చితంగా పార్టీలు సైతం సహకారం అందించాల్సిన అవసరం ఉంది.
