విశాఖపట్నంలో తెల్లవారుజామున ఏపీఎస్ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతైంది. వాల్తేరు డిపో సమీపంలో పార్క్ చేసి ఉంచిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి కొద్దిసేపటికే పూర్తిగా దగ్ధమైంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
శుక్రవారం రాత్రి నెల్లూరు నుంచి ప్రయాణికులతో విశాఖకు చేరుకున్న ఆర్టీసీ బస్సును అనంతరం వాల్తేరు డిపో వద్ద నిలిపి ఉంచారు. శనివారం తెల్లవారుజామున బస్సు ఇంజిన్ వైపు నుంచి పొగలు రావడాన్ని సిబ్బంది గుర్తించారు. అప్రమత్తమయ్యేలోపే మంటలు వేగంగా వ్యాపించి బస్సు మొత్తం చుట్టుముట్టాయి.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. తీవ్రంగా ఎగసిపడుతున్న మంటలను శ్రమించి అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది.
ఈ అగ్నిప్రమాదానికి అసలు కారణం ఏమిటన్న దానిపై అధికారులు విచారణ చేపట్టారు. ఇంజిన్లో సాంకేతిక లోపం కారణమా, మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ప్రయాణికులు బస్సులో లేని సమయంలో ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తప్పినట్లయింది.
