-
ఉన్నత విద్య కోసం విదేశాలకు
-
ఆమె స్థానంలో తెలంగాణకు ఇన్చార్జిగా ముకుల్ వాస్నిక్?
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అనే ప్రచారం పొలిటికల్ వర్గాల్లో నడుస్తోంది. దాదాపు ఏడాది పాటు ఆమె రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆమె స్టడీ టూర్ నిమిత్తం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారు.
దాదాపు పది నెలల పాటు సాగే ప్రత్యేక కోర్స్, రీసెర్చ్ ప్రోగ్రాం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కాలంలో ప్రత్యక్ష రాజకీయ కార్యకలాపాలకు, పార్టీ బాధ్యతలకు ఆమె దూరంగా ఉండనున్నారు.. అయితే ఆమె రాజకీయాలకు పూర్తిగా దూరం అవుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.
-
ఉన్నత విద్య పై ఫోకస్..
రాజకీయాల కంటే ఎడ్యుకేషన్ పై ఆమె దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల వ్యవహారంలో చోటు చేసుకున్న పరిణామాలు… ఆమె నిర్ణయం పై ప్రభావం చూపయనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే సువర్ణ అవకాశం చేతికి వచ్చినట్టే చేజారి పోయింది.
అప్పటినుంచి ఆమె తీవ్ర నిరాశతో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఈ పరిణామాల అనంతరం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు, పార్టీ అంతర్గత సమావేశాల పట్ల ఆమె గతంలో ఉన్నంత చురుగ్గా వ్యవహరించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఎడ్యుకేషన్ టూర్ పేరిట విదేశాలకు వెళ్తున్నట్టు పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది.
-
ప్రత్యేక గుర్తింపు..
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వసనీయ నేతగా, సిద్ధాంతపరంగా పనిచేసే నాయకురాలిగా ఏఐసీసీ స్థాయిలోనే ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ, ప్రభుత్వాల మధ్య సమన్వయం సాధించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
అయితే తన ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లే ప్రతిపాదనను ఆమె కాంగ్రెస్ హై కమాండ్ ముందు ఉంచారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే విదేశాలకు ప్రయాణం కానున్నారు. అయితే ఆమె స్థానంలో కొత్త నేతకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా నియమించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
