క్రైమ్ మిర్రర్ : కేరళ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత పినరయి విజయన్ మీడియా ప్రతినిధులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈడీ కేసుపై స్పందన కోరుతూ విలేకరులు వరుసగా ప్రశ్నలు అడగడంతో ఆయన సహనం కోల్పోయారు. చివరకు మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. బుధవారం చంగనచేరికి వెళ్తున్న విజయన్ మార్గమధ్యంలో కల్లిస్సేరిలోని పీడబ్ల్యూడీ రెస్ట్హౌస్ వద్ద కొద్దిసేపు ఆగారు. ఆయన కోసం అక్కడ వేచి ఉన్న మీడియా ప్రతినిధులు కారు దిగగానే చుట్టుముట్టి ఈడీ కేసుపై ప్రశ్నలు అడిగారు. అయితే విజయన్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా రెస్ట్హౌస్లోకి వెళ్లారు.
విలేకరులు కూడా ఆయనను అనుసరిస్తూ లోపలికి వెళ్లి ప్రశ్నలు కొనసాగించడంతో విజయన్ తీవ్ర అసహనానికి గురయ్యారు. వాష్రూమ్ వైపు వెళ్తున్న సమయంలో మీడియా ప్రతినిధుల వైపు తిరిగి.. తాను అక్కడికి వారిని కలవడానికి రాలేదని, తాను ఎక్కడికి వెళ్లినా వెంటపడతారా అని ప్రశ్నించారు. బాత్రూమ్కు వెళ్లినప్పటికీ వదిలిపెట్టరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొంతసేపటికి బయటకు వచ్చిన విజయన్ మీడియాతో మాట్లాడకుండా నేరుగా తన వాహనంలోకి ఎక్కి చంగనచేరి బయలుదేరారు.
ఇదిలా ఉండగా.. విజయన్, ఆయన కుమార్తె టీ. వీణ, అల్లుడు, ఎమ్మెల్యే పీఏ మహమ్మద్ రియాస్పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని ఈడీ ఇటీవల కేరళ పోలీస్ చీఫ్కు సిఫార్సు చేసినట్లు సమాచారం. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 66(2) ప్రకారం దర్యాప్తుకు సంబంధించిన వివరాలు, ఆధారాలను పోలీసులకు పంపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మీడియా ప్రతినిధులు విజయన్ నుంచి స్పందన తీసుకునేందుకు ప్రయత్నించగా ఈ ఘటన చోటుచేసుకుంది. మీడియా పట్ల విజయన్ కఠినంగా వ్యవహరించడం ఇదే తొలిసారి కాదని గతంలోని కొన్ని ఘటనలను కూడా రాజకీయ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.
also read : ఎర్రకోట పేలుడు ఆత్మాహుతి దాడే.. ఎన్ఐఏ ఛార్జిషీట్లో సంచలన విషయాలు
