క్రైమ్ మిర్రర్ : ఢిల్లీలోని ఎర్రకోట వద్ద గతేడాది నవంబర్ 10న జరిగిన పేలుడు ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక విషయాలను వెల్లడించింది. ఇది సాధారణ పేలుడు కాదని, నిందితుడు ఉమర్ ఉన్ నబీ కారులో ఉండగానే ఐఈడీని యాక్టివేట్ చేసినట్లు దర్యాప్తులో తేలిందని ఛార్జిషీట్లో పేర్కొంది. దీంతో ఈ ఘటనను ఆత్మాహుతి దాడిగా నిర్ధారించినట్లు తెలిపింది. ఎర్రకోటను లక్ష్యంగా చేసుకోవాలనే ఆలోచన ముందుగానే ఉందని ఎన్ఐఏ వెల్లడించింది. 2023 డిసెంబర్ నుంచే నిందితులు పలుమార్లు ఎర్రకోట పరిసరాలను పరిశీలించినట్లు దర్యాప్తులో గుర్తించామని తెలిపింది. ఉమర్ ఇతర నిందితులతో కలిసి అక్కడికి పలుమార్లు వెళ్లినట్లు పేర్కొంది.
ఈ కేసు వెనుక అన్సార్ గజ్వత్-ఉల్-హింద్ (ఏజీయూహెచ్) మాడ్యూల్ ప్రమేయం ఉన్నట్లు ఎన్ఐఏ ఆరోపించింది. మాడ్యూల్కు చెందిన కొందరు వ్యక్తులు శ్రీనగర్లో అరెస్టు కావడంతో కుట్ర బయటపడుతుందనే భయంతో దాడిని ముందుకు తీసుకొచ్చినట్లు ఉమర్పై ఆరోపణలు చేసింది. నిందితుల వద్ద తీవ్రవాద భావజాలానికి సంబంధించిన పత్రాలు, చేతిరాత నోట్స్ లభించినట్లు ఎన్ఐఏ తెలిపింది. పేలుడు పదార్థాలు, ఆయుధాలు, రహస్య కార్యకలాపాలు, ఐఈడీలకు సంబంధించిన సమాచారంతో పాటు గుర్తింపులు మార్చుకోవడం, ఆధారాలు దొరక్కుండా తప్పించుకునే విధానాల గురించి కూడా అందులో ఉన్నట్లు ఛార్జిషీట్లో పేర్కొంది.
also read : జపాన్లో విషాదం.. బుల్లెట్ రైలు ఢీకొని కేరళ యువతి మృతి
