నగరంలోని హైదరాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఆయుధాల చోరీ ఘటన తీవ్ర కలకలం రేపింది. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ స్థావరంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. అత్యంత భద్రత ఉండే ఆర్మీ ప్రాంగణంలో ఆయుధాలు మాయమవడం అధికారుల్లో ఆందోళనకు కారణమైంది.
ఆర్మీ అధికారులు గుర్తించిన వివరాల ప్రకారం.. ఆయుధాలను భద్రపరిచే గది తాళాన్ని పగులగొట్టి దుండగులు లోపలికి ప్రవేశించినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి మొత్తం 12 ఆయుధాలు చోరీకి గురైనట్లు సమాచారం. వీటిలో నాలుగు ఏకే-47 రైఫిళ్లు, ఆరు పిస్టళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్ ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు కొంత మందుగుండు సామగ్రి కూడా కనిపించకుండా పోయినట్లు సమాచారం.
ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. చోరీకి గురైన ఆయుధాల మొత్తం విలువ సుమారు రూ.15 లక్షల వరకు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
అత్యంత భద్రత కలిగిన ఆర్మీ స్థావరంలోనే ఈ ఘటన జరగడంతో భద్రతా లోపాలపై అధికారులు దృష్టి సారించారు. ఆయుధాలు ఎలా మాయమయ్యాయి? ఈ ఘటన వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: మద్యం మత్తులో తండ్రిపై కొడుకు దారుణం.. నవ్వాడని గొంతు కోసి హత్య
