తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ నెలలో నిర్వహించనున్న విశేష పర్వదినాలు, వార్షిక బ్రహ్మోత్సవాల షెడ్యూల్ను టీటీడీ అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 15న ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఉత్సవాల్లో భాగంగా పలు వాహన సేవలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడ సేవను సెప్టెంబర్ 19న నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 20న స్వర్ణరథోత్సవం, 22న రథోత్సవం జరగనున్నాయి. సెప్టెంబర్ 23న చక్రస్నానం, ధ్వజావరోహణ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
అనంతరం సెప్టెంబర్ 24న బాగ్ సవారి, అనంత పద్మనాభ వ్రతం, చక్రస్నానం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
మరోవైపు తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 27 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయినట్లు సమాచారం. దీంతో శ్రీవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. రద్దీకి అనుగుణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
also read: నేపాల్ వరదలు- 962 మంది మృతి, 4 వేల మందికిపైగా గల్లంతు..
